సెమీస్లకు వర్షం ముప్పు:
టీ20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచివుంది. వాతావరణ సమాచారం ప్రకారం సిడ్నీలో గురువారం 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. భారీగా వర్షం పడకున్నా.. మోస్తరు జల్లులు కురుస్తాయట. అవి మ్యాచ్లకు ఆటకం కలిగించే సూచనలు ఉన్నాయని సమాచారం. రెండు సెమీస్ మ్యాచ్లు ఒకే రోజు, ఒకే మైదానంలో జరగనుండడం.. మ్యాచ్లకు వర్షం ముప్పు ఉండడం క్రికెట్ అభిమానులను కంగారెత్తిస్తోంది.
సీఏకు ఐసీసీ షాక్:
ఇక వర్షం ముప్పు నేపథ్యంలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లకి 'రిజర్వ్ డే' ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరింది. కానీ ఐసీసీ మాత్రం సీఏ అభ్యర్థనని తిరస్కరించింది. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో సీఏతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా భారీ షాక్ తగిలింది.
మ్యాచ్ రద్దయితే ఫైనల్కు భారత్:
ఒకవేళ వర్షం కారణంగా సెమీస్ మ్యాచ్లు రద్దయితే పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా ఫైనల్కి వెళ్లనున్నాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం గ్రూప్-ఏ నుండి లీగ్ దశ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన భారత్.. గ్రూప్-బీ నుండి దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడతాయి. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లలో కంగారు మొదలైంది.
అంచనాలను నిజం చేస్తూ సెమీస్కు:
టీ20 ప్రపంచకప్కి భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళలు.. ఆ అంచనాలను నిజం చేస్తూ సెమీస్కు దూసుకెళ్లారు. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్లాడిన భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లని ఓడించి టోర్నీలో అపజయమే లేకుండా దూసుకెళ్లారు. ఇక సెమీ ఫైనల్లోనూ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్కు ఒక విషయం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గెలిచిన నాలుగు మ్యాచ్ల్లో భారత్ బౌలింగ్ బలంతో గట్టెక్కింది. బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం భారత్కు ఇప్పుడు ఉంది.