
హైదరాబాద్: గతేడాది శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో స్వదేశంలో అద్భుత ప్రదర్శన చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాలు ప్రస్తుతం సఫారీ గడ్డపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. లంకపై అద్భుత ప్రదర్శన చేసిన వీరిద్దరూ దక్షిణాఫ్రికాపై పరుగులు సాధించడంలో విఫలమవుతున్నారు.
ఈ క్రమంలో ఆరు వన్డేల సిరిస్లో ఎంతో కీలకంగా మారిన ఐదో వన్డేలో వీరిద్దరికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 93 పరుగులతో రాణించిన పాండ్యా ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
తొలి టెస్టులో 93 పరుగులు చేసిన పాండ్యాపై పలువురు మాజీ క్రికెటర్లు లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్తో పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత జరిగిన రెండు టెస్టులతో పాటు ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో సరైన ప్రదర్శన చేయడంతో పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు.
అయినా, తుది జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఆరు వన్డేల సిరిస్లో భాగంగా మంగళవారం పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదో వన్డే జరగనుంది. ఈ వన్డే కోహ్లీసేనకు ఎంతో ప్రతిష్టాత్మకం. ముఖ్యంగా పాండ్యా కూడా తానెంటో నిరూపించుకోవాల్సి ఉంది.
ఎందుకంటే ఈ సిరిస్లో పాండ్యా ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 3 నాటౌట్, మూడో వన్డేలో 14, నాలుగో వన్డేలో 9 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే నాలుగు మ్యాచ్లు కలిపి ఒక వికెట్ మాత్రమే తీశాడు.
మైదానంలో విఫలమవుతున్న పాండ్యా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. వన్డే సిరిస్లో భాగంగా జట్టులోని సహచరులతో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తున్నాడు. సహచర ఆటగాళ్లతో సెల్ఫీలు దిగడం మాని ఆటపై దృష్టి పెట్టాలని పాండ్యాకు నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
దీంతో కపిల్ దేవ్ లాంటి గొప్ప క్రికెట్ దిగ్గజంతో పాండ్యాని పోల్చి తప్పుచేశామని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కపిల్ను అందుకోవాలంటే పాండ్యా ఇంకా ఎంతో శ్రమించాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఐదో వన్డే నుంచి పాండ్యాను తప్పించాలని అంటున్నారు.
సఫారీ గడ్డపై ఆరు వన్డేల సిరిస్లో అక్షర పటేల్, మహమ్మద్ షమీ, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, శార్దూల్ ఠాకూర్లు ఇంకా తుది జట్టులో చోటు దక్కించుకోని ఆటగాళ్లు. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో కేవలం ఒక్క వన్డేలో మాత్రమే కోహ్లీసేన మార్పుతో బరిలోకి దిగింది.
నాలుగో వన్డేలో గాయపడిన కేదార్ జాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్కు చోటు కల్పించారు. జోహెన్స్బర్గ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీసేన ఓటమిపాలవ్వడంతో ఐదో వన్డేలో మార్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐదో వన్డేలో పాండ్యా స్థానంలో మరోకరికి చోటు కల్పిస్తే బాగుంటుందని అభిమానుల కోరుకుంటున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.