కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రణాళికలు
మళ్లీ అదే పట్టుదలతో విరాట్ కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఇంగ్లీషు బౌలర్లు. ఈ నేపథ్యంలో.. కోహ్లీ వికెట్ను ఎలా దక్కించుకోవాలో అనే విషయంపై రాత్రంతా తమ జట్టు ఆటగాళ్లంతా కలలు కంటామని అంటున్నాడు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి టెస్టు జరుగుతోంది. శుక్రవారం మూడో రోజు ముగిసిన అనంతరం అండర్సన్ మీడియాతో మాట్లాడాడు.
దానిపైనే ఈ రాత్రి కలలు కంటానని
తమ జట్టు విజయానికి కోహ్లీ ఒక్కడు మాత్రమే అడ్డుగా ఉన్నాడని భావించిన అండర్సన్.. అతడి వికెట్ ఎలా దక్కించుకోవాలన్న దానిపైనే ఈ రాత్రి కలలు కంటానని తెలిపాడు. ‘క్రికెట్ ప్రపంచంలో శక్తిమంతులు ఎవరూ ఉండరు. ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సరే ఏదో ఒక బౌలర్ చేతిలో, ఏదో ఒక బంతికి ఔటవ్వాల్సిందే. కోహ్లీ కూడా అంతే. కోహ్లీ వికెట్ ఎలా దక్కించుకోవాలన్న దానిపైనే ఈ రోజు రాత్రి మేమంతా కలలుకంటాం.' అంటున్నాడు.
లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల సహకారం అందితే మాత్రం
'శనివారం 25 నుంచి 30 ఓవర్లకే మ్యాచ్ ఫలితం రావొచ్చని అనుకుంటున్నా. తొలి ఇన్నింగ్స్లోలా కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఉండి, లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల సహకారం అందితే మాత్రం కోహ్లీని ఔట్ చేయడం కష్టమే. కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మా ఫీల్డింగ్ ప్రదర్శన సరిగా లేదు. రెండేళ్ల నుంచి మా జట్టులో ఈ సమస్య ఉంది. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో మా ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా' అని అండర్సన్ తెలిపాడు.
విజయం సాధించాలంటే ఇంకా 84 పరుగులు
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో విజయం సాధించాలంటే ఇంకా 84 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ (43*), దినేశ్ కార్తీక్(18*) మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్గా నిలిచారు.