
హైదరాబాద్: తన పాన్ కార్డు వివరాలను మోసపూరితంగా ఉపయోగించారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే భార్య చేతన రామతీర్థ సోమవారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పాన్ కార్డు వివరాలు దుర్వినియోగం చేయబడటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ వాచ్ కంపెనీపై ఆమె చీటింగ్ కేసు నమోదు చేశారు. తన పాన్ కార్డు వివరాలతో ఎస్ విశ్వనాథన్ అనే వ్యక్తి ముంబైలోని టైమ్ కీపర్స్ బొటిక్ ప్రైవేట్ లిమిటెడ్లో మోసపూరిత లావాదేవీలు నిర్వహించి సుమారు రూ. 32 లక్షల విలువ చేసే వాచీలను కొనుగోలు చేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మేరకు కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఆయా మోసపూరిత లావాదేవీలకు తన పైనాన్షియల్ అకౌంటెంట్ టాక్స్ కట్టాలని చెప్పడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. రెండు వాచీలకు గాను ఆమె ట్యాక్స్ రూపంలో మొత్తం రూ. 32,956 చెల్లించాల్సి వచ్చింది.
అయితే ఈ మోసపూరిత లావాదేవీలపై అనిల్ కుంబ్లే ఇప్పటివరకు స్పందించలేదు. చేతన కూడా ఈ వ్యవహారంలో మీడియా సాయం కోరినట్లు లేదు. చేతన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని వారు తెలిపారు.