గత 14 ఇన్నింగ్స్ల్లో విఫలమైనా ఇషాన్ కిషన్కు జట్టులో చోటు.. ఎందుకంటే?

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో వచ్చిన అవకాశాలను ఈ యువ వికెట్ కీపర్ నిలబెట్టుకోలేకపోతున్నాడు. పేలవ ఆటతీరుతో వికెట్ పారేసుకొని జట్టుకు భారంగా తయారయ్యాడు. న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఆఖరి టీ20లోనూ ఒక్క పరుగుకే పెవిలియ్ చేరాడు.
గతేడాది చివర్లో బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. మళ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. టీ20ల్లో అయితే అతని గణంకాలు దారుణంగా ఉన్నాయి. న్యూజిలాండ్తో ఆఖరి టీ20 మ్యాచ్ గలుపుకొని గత 14 ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ 200 పరుగులు చేశాడు.

గత 14 ఇన్నింగ్స్ల్లో విఫలం..
యావరేజ్ 15.30 ఉండగా.. స్ట్రైక్రేట్ మరీ దారుణంగా 106.41 మాత్రమే ఉంది. ఈ 14 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. 27(26), 14(7), 26(11), 3(5), 8(10), 11(13), 36(31), 10(11), 37(29), 2(5), 1(2), 4(5), 19(32), 1(3) పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. వాస్తవానికి న్యూజిలాండ్తో మూడో టీ20కి ముందే ఇషాన్ కిషన్ను తప్పించాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఇషాన్ కిషన్ స్థానంలో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. కానీ టీమ్మేనేజ్మెంట్ మాత్రం ఇషాన్ కిషన్కే మరో అవకాశం ఇవ్వగా.. అతను దారుణంగా విఫలమయ్యాడు.

వికెట్ కీపింగ్తో..
మైకేల్ బ్రేస్వెల్ వేసిన ఇన్నింగ్స్లో రెండో ఓవర్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక స్పిన్ ఆడే విషయంలో ఇషాన్ కిషన్ తడబడుతున్నాడు. స్పిన్ ఆడటంపై మరింత ఫోకస్ పెట్టాలని కూడా వసీం జాఫర్ వంటి ఆటగాళ్లు ఇషాన్ కిషన్కు సూచించారు. అయితే మూడో టీ20లో ఇషాన్ కిషన్ను మార్చకపోవడానికి బలమైన కారణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వికెట్ కీపింగ్ ఒక్కటే అతనికి వరుసగా అవకాశాలు తెచ్చిపెడుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇషాన్ కిషన్ టాలెంటెడ్ ప్లేయర్ అయినా నిలకడలేమి అతనికి సమస్యగా మారిందంటున్నారు.

టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వదనే..
రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం.. మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ గాయపడటం.. సీనియర్ అయిన కేఎల్ రాహుల్ను టీ20లకు దూరం పెట్టడంతో ఇషాన్ కిషన్కు తిరుగులేకుండా పోయిందన్నాడు. జితేశ్ శర్మ బ్యాకప్ కీపర్గా ఉన్న టీమ్ కాంబినేషన్ నేపథ్యంలో అతన్ని ఆడించలేని పరిస్థితని తెలిపారు. ఇషాన్ స్థానంలో జితేశ్ శర్మను తీసుకుంటే స్పెషలిస్ట్ ఓపెనర్ మిస్సవుతాడని, ఓపెనర్ను ఆడిస్తే వికెట్ కీపర్ ఉండడని ఈ సమస్యతో టీమిండియా మేనేజ్మెంట్ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వలేకపోయిందని వివరిస్తున్నారు.

అందుకే పృథ్వీ షాకు అవకాశం లేదు
పృథ్వీ షా, జితేశ్ శర్మలను ఆడించాలనుకుంటే టీమిండియాకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోతుందని, ఈ కారణమే పృథ్వీ షాకు అవకాశం రాకుండా చేసిందని అభిప్రాయపడుతున్నారు. వన్డేల్లో సూపర్ ఫామ్ కనబర్చిన శుభ్మన్ గిల్ స్కిల్స్పై రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా నమ్మకం ఉంచారని, అందుకే తొలి రెండు టీ20ల్లో విఫలమైనా అతనికి అవకాశమిచ్చారని గుర్తు చేస్తున్నారు. అతను కూడా సెంచరీతో విమర్శలకు నోళ్లు మూయించాడని చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications