సీఎస్కే అత్యుత్తమ జట్టు
టిమ్ విగ్మోర్, ఫ్రెడ్డీ వైల్డ్ రచించిన పుస్తకంలో రాహుల్ ద్రవిడ్ పలు విషయాలను పంచుకున్నాడు. 'ఐపీఎల్ ప్రారంభం నుంచే సీఎస్కే ఇతర ఫ్రాంఛైజీల కంటే బలంగా ఉంది. ఎందుకంటే.. ఆ జట్టు యాజమాన్యానికి అప్పటికే క్రికెట్ జట్టులను నడిపిన అనుభవం ఉంది. చెన్నై అత్యుత్తమ జట్టు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మొదటి నుంచే ఇతర జట్ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టుకు పెద్ద బలం' అని ద్రవిడ్ అన్నాడు.
ఆర్సీబీని పటిష్ఠంగా ఎప్పుడూ చూడలేదు
'ఆర్సీబీ జట్టు బలమైనదే అయినా సమతూకంగా ఉండేది కాదు. జట్టు ఎంపికలో, వేలంలో ఎంతో పేలవమైన నిర్ణయాలు తీసుకునేవారు. బెంగళూరు జట్టును పటిష్ఠంగా ఎప్పుడూ చూడలేదు. మిచెల్ స్టార్క్ జట్టులో ఉన్నప్పుడు ఆ ఏడాది ఉత్తమ ప్రదర్శన చేశారు. ఆర్సీబీ ఎప్పుడూ అద్భుతమైన బ్యాట్స్మెన్ను వేలంలో ఎంపిక చేసుకుంటుంది. జట్టులో నాలుగు విదేశీ ఆటగాళ్ల స్థానాల కోసం ఎంతో మంది ప్రత్యామ్నాయంగా ఉంటారు. కానీ.. సీఎస్కే జట్టులో భారత నాణ్యమైన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు' అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఆర్సీబీ బౌలర్పై ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు
'బెంగళూరు జట్టు కంటే ఉత్తమైన బౌలింగ్ విభాగం ఉండటంతో సీఎస్కే ఎక్కువ విజయాలు సాధిస్తుంది. ఆర్సీబీ గొప్ప బౌలర్ను తీసుకోవడంలో ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు. యువరాజ్ సింగ్ కోసం ఓ సీజన్లో రూ.14 కోట్లు ఖర్చు పెట్టారు. దీంతో నాణ్యమైన బౌలర్లను తీసుకోవడానికి వారి దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఏప్రిల్ 15 వరకు వాయిదా
మహమ్మారి కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇంకా తేల్చకుండా.. నాన్చుడు ధోరణే కనబరిచాడు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఈ సమయంలో ఏమీ చెప్పలేను. లీగ్ను వాయిదా వేసినప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా లేదు. ఏమీ మారలేదు. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. యథాతథస్థితే కొనసాగుతుంది' అని అన్నాడు.