ఆ మాటలు గుర్తుకొచ్చేవి:
మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ను ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అక్షర్ పలు విషయాలును అభిమానులతో పంచుకున్నాడు. 'నేను టీమిండియాకు మూడేళ్లుగా దూరంగా ఉన్నా. ఆ సమయంలో నా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలపై దృష్టిసారించా. జట్టుకు దూరంగా ఉండటంపై స్నేహితులు, తెలిసిన వాళ్లు అనేక మంది అడిగేవారు. బాగా ఆడుతున్నా టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు. ఆ మాటలు నాకు నిత్యం నాకు గుర్తుకొచ్చేవి. అలాంటప్పుడే సరైన సమయం కోసం వేచి చూడాలని నాకు నేను సర్దిచెప్పుకొన్నా' అని అక్షర్ అన్నాడు.
100 శాతం కష్టపడుతా:
'ఎప్పుడు అవకాశం వచ్చినా 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉండాలనుకున్నా. మొతేరాలో అవకాశం వచ్చింది. బాగా ఆడాను. సొంత మైదానంలో ఆడడం ఎప్పటికి బాగుంటుంది' అని అక్షర్ పటేల్ తన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్ ఆడటం తేలికేనా అని అడిగిన ప్రశ్నకు.. 'నన్ను ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు బాగుంటుంది. కానీ ఏదైనా అవకాశం చేజారితే.. అసలు పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని చెప్పాడు.
మరిన్ని వికెట్లు తీస్తా:
ఈ పింక్బాల్ టెస్టు తనకు రెండోదని, మొతేరాలో మొదటిది అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. సొంత మైదానంలో అభిమానుల ముందు అత్యుత్తమ ప్రదర్శన చేయడం ప్రత్యేకంగా ఉందన్నాడు. ఇక రాబోయే మ్యాచ్లోనూ ఇలాగే మరిన్ని వికెట్లు తీయాలని ఉందని అక్షర్ చెప్పుకొచ్చాడు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో నిలిచింది. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగానే మార్చి 4 నుంచి నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.
అంచనాలకు మించి రాణించాడు:
గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అంచనాలకు మించి రాణించాడు. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్ల రికార్డు సాధించిన అక్షర్ మొతేరాలో 10+ వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు. డే/నైట్ టెస్టులో 11/70తో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ అతడు రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2018/19లో శ్రీలంకపై ప్యాట్ కమిన్స్ 10/62, 2016/17లో పాక్పై దేవేంద్ర బిషూ 10/174 ఈ ఘనత సాధించారు. అయితే అక్షర్వే ఇక్కడ మెరుగైన గణాంకాలు.