డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు:
28 ఏళ్ల తర్వాత విశ్వకప్ గెలుపొందడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సంబరాల వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే 2011 ప్రపంచకప్ జట్టు సభ్యుడైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆ మ్యాచ్కి సంబంధించ ఓ అరుదైన సంఘటనని తాజాగా అభిమానులతో పంచుకున్నారు. అప్పటివరకూ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ని మాత్రమే చూసిన తాను.. ఆ రోజు ఆయన డ్యాన్స్ చేయడం కూడా చేశానని హర్భజన్ చెప్పుకొచ్చారు. స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో హర్భజన్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ విషయాలను గుర్తుచేసుకున్నారు.
వదినతో కలిసి చిందులు వేశారు:
'సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడం తప్ప మరో పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు. కానీ.. ఆ రోజు రాత్రి ఆయన ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేశారు. అంజలి వదినతో కలిసి హిందీ పాటకి చిందులు వేశారు. వాళ్లు ఇద్దరు డ్యాన్స్ చేయడం చూసి మేము చాలా సంతోషించాం. సచిన్ బాగా డాన్స్ వేశారు. ట్రోఫీని ముద్దాడడం సచిన్ కన్న కల. అది నెరవేరడంతో ఆయన సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి' అని హర్భజన్ తెలిపారు.
పార్టీ ఏర్పాట్లు చూసుకున్నా:
ఆ పార్టీ బాధ్యతలను సచిన్ తనపై ఉంచారని టీమిండియా పేసర్ అశీష్ నెహ్రా అన్నారు. గాయం కారణంగా నెహ్రా ఫైనల్ మ్యాచ్ ఆడని విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న నెహ్రాను పార్టీ ఏర్పాట్లు చూసుకోమని సచిన్ ఆదేశించారని పేర్కొన్నారు. 'పార్టీ జరుగుతున్న గది చాలా చిన్నది. నేనే ముందు వెళ్లాను. మిగితా వాళ్లు అంతా మ్యాచ్ ఆడారు కాబట్టి.. రూంకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. నేను అంతా సిద్ధంగా ఉంది అంటూ అందరి మెసేజ్లు పంపుతూ.. 40 నిమిషాల పాటు ఎదురుచూశా' అని నెహ్రా చెప్పుకొచ్చారు.
భారత్ విజయం
వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ని ధోనీ ముగించాడు.