ద్రవిడ్ బౌలింగ్.. సీఎం బ్యాటింగ్:
తమిళనాడులోని సాలెం నగరంలో క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించడానికి ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్, తమిళనాడు సీఎం పళనిస్వామి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం ద్రవిడ్, పళనిస్వామి సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. బౌలర్ శైలిలో కాకుండా ద్రవిడ్ సరదాగా బంతులు విసరగా.. పళనిస్వామి బ్యాటింగ్ చేశారు. పక్కనే ఉన్న మిగతా వారు సీఎంను ఎంకరేజ్ చేసారు. ఇక మీడియా సభ్యులు సీఎం బ్యాటింగ్ను తమ కెమెరాలలో బంధించారు.
వచ్చే తరంకు ఉపయోగపడతాయి:
స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ స్టేడియంలోని సదుపాయాలను కొనియాడారు. 'స్టేడియంలో సదుపాయాలను టీఎన్సీఏ, తమిళనాడు ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాటు చేశాయి. వచ్చే తరంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లు చిన్న చిన్న పట్టణాల నుంచే వస్తారని నమ్ముతున్నా. వారికి ఇలాంటి సదుపాయాలున్న మైదానాలు ఎంతో ఉపయోగపడతాయి. సీఎం పళనిస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు' అని ద్రవిడ్ అన్నారు.
నటరాజన్ తర్వాతి తరానికి ప్రేరణ:
సాలెం నగరానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి.నటరాజన్ను కూడా ద్రవిడ్ ప్రశంసించారు. నటరాజన్ తర్వాతి తరానికి ప్రేరణగా నిలుస్తాడు అని పేర్కొన్నారు. ఐపీఎల్లో నటరాజన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. రూ. 3 కోట్లతో సాలెం క్రికెట్ మైదానాన్ని నిర్మించారు.
టోర్నమెంట్లు నిర్వహిస్తాం:
స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐపీఎల్ జట్టు చెన్నె సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్, టీఎన్సీఏ అధ్యక్షుడు రూపా గురునాథ్ కూడా హాజరయ్యారు. 'ఈ ఏడాది జరిగే తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్లతో సహా జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఇక్కడ నిర్వహిస్తాం. ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడానికి సీఎం సహాయం కోరాం. ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నె జట్టు ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఆడటానికి ప్రయత్నిస్తాం' అని శ్రీనివాసన్ తెలిపారు.