ధోనీతో వాగ్వాదం..
ఇక అంపైర్గా తన చివరి సిరీస్.. 2011 భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ధోనీతో జరిగిన చిన్నపాటి వాగ్వాదాన్ని హార్పర్ గుర్తు చేసుకున్నాడు. జమైకా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్లో పదేపదే మిడిల్ పిచ్పై పరుగెత్తిన భారత పేసర్ ప్రవీణ్ కుమార్పై హార్పర్ ఇన్నింగ్స్ నిషేధం విధించాడు. అయితే ఆ మ్యాచ్తోనే ప్రవీణ్ కుమార్ టెస్ట్ల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ.. హర్పర్ నిర్ణయాన్ని ధోనీ తప్పుబట్టాడు.
ప్రవీణ్ కుమార్పై నిషేధం
ఇదే విషయాన్ని ప్రస్తావించిన హార్పర్..‘పదేపదే పిచ్పై పరుగెత్తుతున్న టెస్ట్ అరంగేట్ర ఆటగాడు ప్రవీణ్ కుమార్పై నేను నిషేధం విధించడం ధోనీకి నచ్చలేదనుకుంటా.. వెంటనే నా దగ్గరకు వచ్చిన అతను అరంగేట్ర ఆటగాడి పట్ల కొంచెం దయతో ఉండాలని సూచించాడు. కానీ ప్రవీణ్ కుమార్ అప్పటికే 52 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. నిబంధనలపై అతనికి అవగాహన ఉంది. ఈ విషయం చెబుతూ.. మిగతా ఇన్నింగ్స్లో ప్రవీణ్ కుమార్పై నిషేధం విధిస్తున్నానని చెప్పినప్పుడు ధోనీ నాతో అన్న మాటలు గుర్తున్నాయి.
నీతో ఎప్పుడూ ఇదే సమస్య..
‘ఇంతకు ముందు కూడా నీతో ఇదే సమస్య ఎదుర్కొన్నాం'అని ధోనీ నాతో అన్నాడు. ప్రవీణ్ కుమార్ పిచ్పై పరుగెత్తి నిషేధానికి గురైన రెండో బౌలర్ అని ధోనీకి తెలుసేమో.. 2000లో ఆశిష్ నెహ్రా కూడా ఇదే తరహాలో బ్యాన్ గురైన విషయం అతనికి గుర్తుకు వచ్చిందేమో. లేకుంటే ఇలాంటి చర్యలు తీసుకునే ఏకైక కెప్టెన్ నేనేనని భావించాడో.'అని హార్పర్ చెప్పుకొచ్చాడు.
అంపైర్లపై ధోనీ కామెంట్..
ఇక ఈ మ్యాచ్లో భారత్ 63 పరుగులతో గెలుపొందింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోనీ అంపైర్ నిర్ణయాలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే మ్యాచ్ ఇంకా ముందే ముగిసేది. నేను ఈ సమయానికి హోటల్లో ఉండేవాడిని'అని కామెంట్ చేశాడు. అయితే ఇలా మాట్లాడిన ధోనీపై చర్యలు తీసుకోవాల్సిందని, కానీ ఐసీసీ ఆపని చేయలేదని హర్పర్ అన్నాడు. ఇక ధోనీ చెప్పినట్లుగా మ్యాచ్ ముందుగానే ముగిసేదని, కాకపోతే భారత ఆటగాళ్లు క్యాచ్లు జారవిడచకుంటే అలా జరిగేదన్నాడు. ధోనీపై ఐసీసీ చర్యలు తీసుకోకపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నాడు. ఇక ఈ వివాదం కారణంగా హర్పర్ ఇంకా రెండు టెస్ట్లు మిగిలి ఉండగానే తన అంపైరింగ్ కెరీర్ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్లో తాను రెండు తప్పిదాలు చేశానని ఒప్పుకున్న హర్పర్.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోకపోవడంతో అలా జరిగిందన్నాడు.