కాట్రెల్కు మూడు వికెట్లు
గురువారం అర్ధరాత్రి బార్బడోస్ వేదికగా ఐర్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 237 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (63) టాప్ స్కోరర్. విలియం పోర్టర్ఫీల్డ్ (29), కెవిన్ ఓ బ్రైన్ (31), సిమి సింగ్ (34) పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. షెల్డన్ కాట్రెల్ మూడు వికెట్లు తీసాడు.
పూరన్ కీలక ఇన్నింగ్స్
లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. ఓపెనర్ షై హోప్ (25) క్రీజులో నిలబడినా.. ఎవిన్ లూయిస్ (7), షిమ్రాన్ హెట్మియర్ (6), బ్రాండన్ కింగ్ (0) పెవిలియన్ బాటపట్టారు. ఈ సమయంలో నికోలస్ పూరన్ (52)తో కలిసి కెప్టెన్ కీరన్ పొలార్డ్ (40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్ రేసులోకి వచ్చింది. పూరన్-పొలార్డ్ నిష్క్రమణ అనంతరం కొంత ఆందోళన నెలకొంది.
కాట్రెల్ అద్భుతం
అయితే హేడెన్ వాల్ష్ (46 నాటౌట్), ఖారీ పియరీ (18), జోసెఫ్ (16) రాణించడంతో విండీస్ విజయానికి చేరువగా వచ్చింది. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. ఐర్లాండ్కు ఒక వికెట్ కావాలి. మొదటి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి వాల్ష్ సింగల్ తీసాడు. మూడు, నాలుగో బంతులకు ఒక్కో సింగల్ వచ్చినా.. కాట్రెల్ రెండుసార్లు రనౌట్ ప్రమాదాల నుండి బయటపడ్డాడు. ఇక చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి దశలో కాట్రెల్ అద్భుతమే చేశాడు. కవర్స్ దిశగా భారీ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు.
తొలి నం.11గా అరుదైన రికార్డు
సిక్సర్తో మ్యాచ్ను గెలిపించిన తొలి నం.11గా అరుదైన రికార్డును కాట్రెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాట్రెల్ సిక్సర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొట్రెల్ సిక్సర్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విండీస్ కైవసం చేసుకుంది. మూడో వన్డే ఆదివారం జరగనుంది.
|
ఐపీఎల్ వేలంలో భారీ ధర
గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కాట్రెల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంచైజీ భారీ ధరకు సొంతం చేసుకుంది. కాట్రెల్ కనీస ధర రూ.50 లక్షలు కాగా.. ఏకంగా 17 రెట్లు ఎక్కువ పెట్టి రూ.8.5 కోట్లకు కనుగోలు చేసింది. కాట్రెల్ను దక్కించుకునేందుకు పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తి కనబరిచాడు. కుంబ్లే నిరాశకు గురై కాట్రెల్ను తీసుకున్నాడు. అతనికి 8.5 కోట్లు అవసరం లేదు అని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.