టాప్ క్లాస్ ఇన్నింగ్స్ అది:
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'గత నాలుగు రోజులలో అందరూ మంచి క్రికెట్ ఆడారు. జట్టు విజయాలు సాధించడం చాలా ముఖ్యం. ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్ కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో హనుమ విహారీ స్టాండ్ అవుట్ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. అంకితభావం గల ఆటగాడు. ఈరోజు టాప్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు క్రీజులో ఉన్నపుడు డ్రెస్సింగ్ రూమ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. అతని ఆట గురించి తెలుసు. తను సహజంగానే మనసు పెట్టి ఆడతాడు. జట్టు విజయం కోసం పరితపిస్తాడు. తనకు ఎంతో భవిష్యత్తు ఉంది. అతన్ని ఎంపిక చేసినందుకు తన ఆటతో సమాధానం చెప్పాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
బౌలర్లు లేకపోతే విజయాలు సాధ్యం కావు:
'విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా ఉండటం ఆనందంగా ఉంది. అయితే ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. నాణ్యమైన బౌలర్లు లేకపోతే, ఈ ఫలితాలు సాధ్యం కావు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. బుమ్రా, షమీ, ఇషాంత్, జడేజా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు. ఈ రోజు షమీ అద్భుత స్పెల్ వేసాడు. జడేజా సుదీర్ఘ స్పెల్ బౌలింగ్ చేశాడు. ఇషాంత్ జట్టుకు పెద్ద ఆస్తి. వారు ఈ ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా' అని కోహ్లీ అన్నాడు.
257 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
ఆరంభం మాత్రమే:
'కెప్టెన్సీ అనేది పేరుకు ముందు ‘సీ' అనే అక్షరం మాత్రమే. దానితో ఆటలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. జట్టు రాణించకపోతే కెప్టెన్ ఒక్కడే విజయాలు సాధించలేడు కదా, ఇదంతా జట్టు సభ్యుల కృషి. ఇది ఛాంపియన్షిప్ ఆరంభం మాత్రమే. మరిన్ని విజయాలు సాధించడమే మా ముందున్న లక్ష్యం. వెస్టిండీస్ తమ తప్పులను తెలుసుకుని పుంజుకుంటుందని అనుకుంటున్నా. బౌలింగ్ కోణంలో వారు అత్యుత్తమంగా ఉన్నారు. హోల్డర్, రోచ్ లాంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఎర్ర బంతితో వారి బౌలింగ్ దాడిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. ఇక పరుగులు సాధిస్తే వారు టెస్ట్ క్రికెట్లో చాలా ప్రమాదకరమైన జట్టుగా మారుతారు' అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.