బార్బడోస్: పాకిస్థాన్లో పర్యటించాలంటే ఏ క్రికెట్ జట్టుకైనా దడే. ఇప్పుడు తాజాగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా పాక్లో పర్యటన ప్రతిపాదనను తిరస్కరించింది. తమ ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ ఆతిథ్యాన్ని స్వీకరించాలని అంతర్జాతీయ క్రికెటర్ల సమాఖ్య(ఎఫ్ఐసీఏ) వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్(డబ్ల్యూఐసీబీ)కు ప్రతిపాదనలు పంపింది.
ఈ నేపథ్యంలో విండీస్ బోర్డ్ పై విధంగా స్పందించింది. పాక్ వెళ్తే తమ ఆటగాళ్ల ప్రాణాలకు ముప్పు ఉందని, వారికి ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. కాగా, పీఎస్ఎల్ సందర్భంగా పాక్లో పర్యటించాలని ఉందని ఆండ్రీ రస్సెల్ వ్యాఖ్యానించగా, సెక్యూరిటీ కల్పిస్తే తనకు ఏ అభ్యంతరం లేదని అప్పటి విండీస్ కెప్టెన్ డారెన్ సమీ స్పష్టం చేశాడు.
విండీస్ జట్టు తమ దేశంలో పర్యటించాలని టెస్ట్, వన్డే సిరీస్లకు సంసిద్ధం కావాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) కొద్ది రోజుల కిందట విండీస్ బోర్డుకు లేఖ రాసింది. అయితే విండీస్ ఇందుకు నిరాకరించింది. తటస్థ వేదిక అమెరికాలోని ఫ్లోరిడాలో అయితే తమకు ఏ సమస్య ఉండదని పీసీబీకి వెల్లడించింది.

గతంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తమ ఆటగాళ్లకు భయాలున్నాయని, అయితే, పాక్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలపాలని, దీనిపై సలహా ఇవ్వాలంటూ ఎఫ్ఐసీఏను విండీస్ బోర్డ్ కోరింది. చివరంగా మార్చి నుంచి మే మధ్యలో పాక్ జట్టు కరీబియన్లో పర్యటించాలని సూచించింది. రెండు టీ20లు, మూడు వన్డేలు, మూడు టెస్టులు ఆడేందుకు రావాలని షెడ్యూల్ ఖరారు చేసింది.
2009లో ఉగ్రదాడి
2009లో పాకిస్థాన్లో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. లాహోర్లో బస్సులో వెళ్తున్న శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆటగాళ్లు తృటిలో ఉగ్రవాదుల నుంచి తప్పించుకున్నారు. ఆనాటి నుంచి పాక్లో పర్యటించేందుకు ఏ జట్టూ అంగీకరించడం లేదు. దీంతో తటస్థ వేదికల్లోనే మ్యాచులు ఆడుతూ నెట్టుకొస్తోంది పాక్. అయితే, తమకు ఆదాయం రావాలంటే మాత్రం తమ దేశంలోనే మ్యాచులు జరగాలని, తమ దేశంలో పర్యటించాలని ఇతర దేశాల బోర్డులకు పాక్ విజ్ఞప్తి చేస్తోంది. కాగా, తమ ఆటగాళ్ల ప్రాణాలకు భద్రతలేనప్పుడు తామెలా పాక్ పర్యటనకు అంగీకరిస్తామని ప్రశ్నిస్తున్నాయి ఆయా దేశాల బోర్డులు.