
హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా గయానా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండిస్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో విండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అనంతరం 272 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 268 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(54), షకిబ్ ఉల్ హసన్(56), ముష్పికర్ రహీమ్(68)లు హాఫ్ సెంచరీలు సాధించారు.

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో వెస్టిండిస్ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 8 పరుగులు అవసరమైన తరుణంలో కెప్టెన్ జాసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక వికెట్ తీసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో వెస్టిండిస్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండిస్ బౌలర్లలో దేవేంద్ర బిషూ రెండు వికెట్లు పడగొట్టగా... ఆండ్రి రస్సెల్, జాసన్ హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 49.3 ఓవర్లలో 271 పరుగులు చేసింది. విండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్(29), సాయ్ హోప్(25) ఫర్వాలేదనిపించారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్మయర్(125; 93 బంతుల్లో 3ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. అతనికి మద్దుతగా పావెల్(44) పరుగులతో హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. బంగ్లా బౌలర్లలో మోర్తాజా 4 వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో తమీమ్ ఇక్బాల్ (130 నాటౌట్) పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వెస్టిండిస్ విజయంతో మూడు వన్డేల సిరిస్ 1-1తో సమం అయింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో వన్డే శనివారం జరగనుంది.