పునరాగమనంకు ఇదే మంచి అవకాశం:
ఓ మీడియా సమావేశంలో బ్రావో మాట్లాడుతూ... 'కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని అనుకుంటూ ఉన్నా. కోచ్ ఫిల్ సిమన్స్, కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నాయకత్వంలో విండీస్ జట్టు బాగుంది. ఇదే నా పునరాగమనంకు మంచి అవకాశం. మా క్రికెట్ బోర్డు పరిపాలనలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పునరాగమనం చేయాలని ఉంది. ఈ విషయాన్ని నా అభిమానులకు, నా మంచి కోరుకునే వారికి తెలియజేస్తున్నా' అని అన్నాడు.
యూటర్న్కు కారణం అదే:
'నా రిటైర్మెంట్పై వెనక్కి తీసుకోవడానికి కారణం ఒక్కటే. బోర్డు పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయి. బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేని కారణంగానే అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇప్పుడు పాలన మారడంతో నా మనసు కూడా మార్చుకున్నా. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. పొలార్డ్, సిమన్స్, హోల్డర్ వంటి అనుభవ క్రికెటర్లు ఉన్నారు. నేను కూడా నా వంతు సాయం చేస్తా. పటిష్ట టీ20 జట్టును తయారుచేస్తాం. ఒకసారి వెస్టిండీస్ టీ20 జట్టుకు ఎంపికైతే పూర్తిగా కట్టుబడి ఉంటా' అని పేర్కొన్నాడు.
పాకిస్థాన్పై చివరి టీ20:
బ్రేవో 2018 అక్టోబర్లో రిటైర్మెంట్ ప్రకటించాడు. సెప్టెంబర్ 2016లో పాకిస్థాన్పై చివరి టీ20 ఆడాడు. 2012, 2016ల్లో విండీస్ గెలిచిన టీ20 వరల్డ్కప్లో సభ్యుడు. విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేసి రిటైర్మెంట్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన బ్రేవో.. విదేశీ లీగ్లో అలరిస్తున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, బీబీఎల్లో మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు:
తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్ అని బ్రేవో ఇటీవలే తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తనతో పాటు చాలామంది క్రికెట్ కెరీర్ను నాశనం చేశాడు అని అన్నాడు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్-2019లో భాగంగా విండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బ్రేవో చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. బ్రేవో తాజా నిర్ణయంతో విండీస్ తరఫున ఆడే అవకాశాన్ని ఆ దేశ సెలక్టర్లు ఇస్తారో లేదో చూడాలి.