హైదరాబాద్: రెండు సంవత్సరాలకు ముందు మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ప్రధాన స్పిన్నర్లుగా కొనసాగారు. అయితే, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సెలక్టర్లు వాళ్లిద్దరినీ పక్కన పెట్టి పెట్టి చైనామన్ స్పిన్నర్లు అయిన కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్లకు ఎక్కువ అవకాశాలు కల్పించారు.
2nd ODI: జోరు కొనసాగించేనా? మరో విజయంపై కన్నేసిన కోహ్లీసేన
తమకు అందివచ్చిన అవకాశాలను వీరిద్దరూ ఒడిసి పట్టుకుని జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించడంతో పాటు జట్టులో తమ స్థానాలను సైతం సుస్థిరం చేసుకున్నారు. కుల్దీప్ అయితే టెస్టుల్లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు. చాహల్కు ఇంకా ఆ అవకాశం రాలేదు. వీరిద్దరూ రాణించడంతో సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు కేవలం టెస్టులకే పరిమితమయ్యారు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే నాగ్ పూర్ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ నేఫథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మీరిద్దరొచ్చి అశ్విన్, జడేజాలను జట్టు నుంచి సాగనంపేశారు కదా? అని కుల్దీప్ను విలేకరులు ప్రశ్నించగా కుల్దీప్ అలాంటిదేమీ లేదన్నాడు.
"అలాంటిదేమీ లేదు. మేం ఎవరినీ బయటికి పంపలేదు. మాకు దక్కిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాం అంతే. అశ్విన్, జడేజా భారత్ తరఫున ఎప్పుడూ సత్తా చాటుతూనే ఉన్నారు. టెస్టుల్లో వాళ్లిద్దరూ ఇప్పటికీ ఆడుతున్నారు. వారికి ఎంతో అనుభవం ఉంది. మేం వారి నుంచి ఎంతో నేర్చుకున్నాం. నేను టెస్టుల్లోనూ ఆడుతున్నా" అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.