మేం విమర్శల్ని పట్టించుకోలేదు
‘విమర్శల్ని మేము పట్టించుకోలేదు. సిరీస్లో బాగా ఆడాము కాబట్టే.. 1-1తో నిలవగలిగాం. మైదానంలో నాకు అప్పగించిన బాధ్యతని పూర్తిచేయడమే నా విధి. మా జట్టు ప్రదర్శనపై అనుమానం వ్యక్తం చేసిన వారి అంచనాలు తప్పు అని నిరూపించాం' అని నర్స్ వెల్లడించాడు.
సమష్టిగా ఆడుతున్నామంటోన్న శామ్యూల్స్..
'మేమంతా సమష్టిగా ఆడుతున్నామని చెప్పిన శామ్యూల్స్.. తర్వాతి రెండు మ్యాచ్లను కోల్పోవడానికి ఇష్టపడటం లేదన్నాడు. మిగతా మ్యాచ్లను గెలవాలని చూస్తున్నాం. మేం పోటీ మాత్రమే ఇవ్వాలని అనుకోవడం లేదు. గెలవాలని చూస్తున్నాం. తదుపరి మ్యాచ్ను మేం మరింత సీరియస్గా తీసుకుంటాం' అని శామ్యూల్స్ తెలిపాడు.
నర్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో బ్యాట్తో 22 బంతుల్లోనే 4ఫోర్లు, 2సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన నర్స్.. బంతితోనూ శిఖర్ ధావన్ (35), రిషబ్ పంత్ (24) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. భారత్పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు గెలుపొందగా.. కీలక ప్రదర్శన చేసిన నర్స్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే
పర్యటన ఆరంభంలో టెస్టులు ఆడిన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో చిత్తుగా ఓడటంతో అందరూ విమర్శలు గుప్పించారు. కానీ.. వన్డేల్లోకి వచ్చేసరికి ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. గౌహతి వన్డేలో 322 పరుగులు చేసి ఓడిన ఆ జట్టు.. విశాఖపట్నం వన్డేలో 321 పరుగులతో మ్యాచ్ని డ్రాగా ముగించింది. తాజాగా పుణె వన్డేలోనూ 283 పరుగులు చేసి.. 43 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమమవగా.. నాలుగో వన్డే బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరగనుంది.