హైదరాబాద్: భారత జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి కోసం ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసినట్లు శ్రీలంక బౌలింగ్ కోచ్ రుమేశ్ రత్నాయకే తెలిపారు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నవంబర్ 16న జరగనుంది.
ఈ నేపథ్యంలో శ్రీలంక బౌలింగ్ కోచ్ రుమేశ్ రత్నాయకే మీడియాతో మాట్లాడారు. 'కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి కోసం ఒక్కో వ్యూహం సిద్ధం చేసుకుని వచ్చాం. టెస్టు సిరిస్లో మాకంటూ ఓ ప్లాన్ ఉంది. తప్పకుండా మా స్ట్రాటజీస్ పని చేస్తాయి' అని తెలిపాడు.
'అంతేకాదు ఆ వ్యూహాలేమిటో ఇప్పుడే చెప్పం. నేరుగా మైదానంలోనే ప్రయోగిస్తాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది కూడా అప్పుడే తెలుస్తోంది. గతంలో భారత్పై 5టెస్టుల సిరీస్ను 0-5తో ఓడిపోయినా ఇటీవల పాకిస్థాన్పై 2-0తో సిరీస్ సొంతం చేసుకున్నాం' అని కోచ్ పేర్కొన్నాడు.
'దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు భారత గడ్డపై మేము ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఈ పర్యటనలో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇరు జట్లలో చైనామన్ బౌలర్లు ఉన్నారు. ఈ ఇద్దరూ క్రికెట్ దిగ్గజం బ్రాడ్ హాగ్ నుంచే సలహాలు తీసుకున్నారు' అని రుమేశ్ రత్నాయకే తెలిపాడు.
'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్పై టెస్టు సిరీస్ మాకెంతో లాభదాయకం. టెస్టుల్లో అగ్రస్ధానంలో ఉన్న జట్టుతో ఆడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. భారత్తో ఇప్పటి టెస్టు సిరీస్ మాకు సవాల్తో కూడుకున్నది. తొలి టెస్టులో గెలిచి తమపై ఉన్న చెత్త రికార్డును తుడిపేస్తాం' అని రుమేశ్ తెలిపాడు.
తొలి టెస్టులో శ్రీలంక బౌలర్ సందకన్ చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నకు గాను చెప్పలేనని అన్నాడు. మాజీ కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ గాయం నుంచి కోలుకోని జట్టులోకి అందుబాటులోకి రావడం అదనపు బలమని తెలిపాడు. ఇక, బౌలర్లు ఎస్జీ బాల్తో రివర్స్ సింగ్ను కూడా ప్రాక్టీస్ చేశాడని పేర్కొన్నాడు.