హైదరాబాద్: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. 0-2తో ముగించింది. ఈ పరాజయాల వెనుక టీమిండియా బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శనే కారణమంటూ పేర్కొన్నాడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. చెత్తగా ఆడటం వల్లే తాము ఘోర పరాజయం పాలయ్యామని కోహ్లి వాపోయాడు. లార్డ్స్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో కోహ్లీ మాట్లాడాడు. పేలవమైన ప్రదర్శన చూపిన తమకు గెలిచే అర్హత లేదని తేల్చేశాడు.
'మా ఆటతీరు చెత్తగా ఉంది. గత ఐదు టెస్టుల్లో మరీ ఇంత అధ్వానంగా ఆడటం ఇదే తొలిసారి. ఈ టెస్టులో మాకు గెలిచే అర్హత లేదు. పిచ్ను నిందించను. ప్రతికూల వాతావరణ పరిస్థితులంటూ సాకులు చెప్పను. పిచ్ కుదురుగా ఆడేందుకే అవకాశమిచ్చినా... మొత్తంగా మేం ఏమాత్రం బాగా ఆడలేదంతే! ఆటలోనే కాదు తుది జట్టు కూర్పులోనూ పొరపాటు చేశాం. స్పిన్నర్కు బదులు మరో సీమర్నే తీసుకోవాల్సింది. ప్రస్తుతం సమస్యగా ఉన్న వెన్నునొప్పి నుంచి త్వరలోనే కోలుకుంటా. మరో ఐదు రోజుల తర్వాత మొదలుకానున్న మూడో టెస్టుకు తప్పకుండా కోలుకుంటా' అని కెప్టెన్ కోహ్లి వివరించాడు.
మరోవైపు భారీ విజయాన్ని అందించిన తమ బౌలర్లపై ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రశంసలు కురిపించాడు. సమష్టిగా రాణించి గెలిచామని చెప్పుకొచ్చాడు. 'తమ జట్టు మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. అండర్సన్, వోక్స్ల ప్రదర్శన అసాధారణం. ముఖ్యంగా వోక్స్ బాగా ఆడాడు. తానెంత ప్రతిభావంతుడో మరోసారి చాటుకున్నాడు. నిలకడగా కష్టపడుతున్నాడు. నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో మూడో టెస్టుకు అదనంగా లభించిన విశ్రాంతి రోజును సద్వినియోగం చేసుకుంటాం. నిజానికి మేం ఇంకా మా పూర్తిస్థాయి ఆటతీరును ప్రదర్శించలేదు. అయినా సిరీస్లో మేం మంచి స్థితిలో ఉన్నాం' అని వివరించాడు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: క్రిస్ వోక్స్
గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తర్వాత తాను చేసిన ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నట్టు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న క్రిస్ వోక్స్ తెలిపాడు. వర్షం కారణంగా ఒక రోజు ఆట పూర్తిగా రద్దయిన తర్వాత కూడా మూడు రోజుల్లోనే తాము గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. సెంచరీతో లార్డ్స్ మైదానంలోని ఆనర్స్ బోర్డులో తన పేరు చూసుకోవడం చాలా ఆనందంగా ఉందని.. ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేస్తుందని సంతోషం వ్యక్తం చేశాడు.