అప్పటి నుంచే స్లెడ్జింగ్ చేస్తున్నాడు
ఫేస్బుక్లో బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్తో లైవ్ చాట్ సందర్భంగా రుబెల్ హుస్సేన్ తన అండర్ -19 రోజులను గుర్తుచేసుకున్నాడు. రుబెల్ మాట్లాడుతూ... 'కోహ్లీ, నేను అండర్-19 ప్రపంచకప్ నుంచి పోటీపడుతున్నాం. ఆ టోర్నీ నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. అప్పట్లోనే కోహ్లీ మైదానంలో ఎక్కువగా తన నోటికి పని చెప్పేవాడు. కానీ ఇప్పుడు టీమిండియాకి ఆడే సమయంలో మాత్రం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. కోహ్లీ స్లెడ్జింగ్లో ఏ స్థాయికి వెళ్లగలడో మన అందరికీ తెలుసు' అని రుబెల్ వెల్లడించాడు.
2011 వన్డే ప్రపంచకప్లో గొడవ
2011 వన్డే ప్రపంచకప్లో విరాట్ వికెట్ల మధ్య పరుగు తీస్తుండగా.. రుబెల్ ఉద్దేశపూర్వకంగానే కోహ్లీ శరీరంపైకి బంతి విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య మైదానంలో గొడవ జరగగా.. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ సద్దుమణిగించాడు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ మైదానంలో మాటల యుద్ధానికి దిగారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టినప్పుడు రుబెల్ హద్దులు మీరి సంబరాలు చేసుకోవడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.
ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాడు
అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కొత్తలో కొన్నిసార్లు మైదానంలో హద్దులు దాటిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్గా మారిన తర్వాత మాత్రం క్రమశిక్షణతో మెలుగుతున్నాడు. ధోనీ నుంచి చాలా నేర్చుకున్నాడు. అయితే ప్రత్యర్థి ఏమాత్రం కవ్వించినా.. కోహ్లీ అదే రీతిలో బదులిచ్చేందుకు వెనుకాడటం లేదు. అది నోటితోనా బ్యాట్తోనా అనేది మ్యాచ్, ప్రత్యర్థి వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది.
ఎప్పుడు మొదలైనా సిద్ధం
కరోనా కారణంగా నిలిచిపోయిన క్రికెట్ పోటీలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమైనా తాను సిద్ధంగానే ఉంటానని తాజాగా విరాట్ కోహ్లీ అన్నాడు. 'అదృష్టవశాత్తు ఇంట్లో జిమ్ పరికరాలు మొత్తం ఉన్నాయి. కసరత్తులు చేస్తున్నా. అందుకే ఫిట్నెస్కు వచ్చిన సమస్యలేదు. నెట్స్లో గంటల కొద్దీ ప్రాక్టీస్ కన్నా మన మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికే ఇష్టపడతా. మానసిక స్థితి బాగుంటే సానుకూలంగా ఆలోచించగలం. ఆట మళ్లీ ఎప్పుడు ప్రారంభమైనా నేను ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉంటా. ఎక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలుపెట్టేందుకు ఇబ్బందేం లేదు' అని కోహ్లీ చెప్పాడు.