హైదరాబాద్: మొక్కవోని పట్టుదలతో ఇంగ్లాండ్ బౌలర్లకు టీమిండియా కెప్టెన్ కోహ్లీ విసుగుతెప్పించాడని ఇంగ్లీషు బౌలర్ శామ్ కర్రాన్ అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. గురువారం, రెండో రోజు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 100పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇలా వరుస వికెట్లు పడిపోతున్నా.. మనో ధైర్యంతో క్రీజులో పాతుకుపోయాడు కోహ్లీ. అదే క్రమంలో.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లతో కలిసి భారత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు.
వంద పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత్ పని ఇక అయిపోయందనుకున్నారు. ప్రధాన బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరడంతో.. మిగతా ఆటగాళ్లను ఔట్ చేయడం ఇక సులువేననుకున్నారు. దాదాపు భారత్ 150 లేదా 200 పరుగులకు మాత్రమే పరిమితమవుతుందని భావించారు. కానీ, కోహ్లీ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను కూడదీసుకుని జట్టను ముందుకు నడిపించాడు. వీలైనంత వరకు తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ, సెంచరీని కూడా బాదేశాడు. కోహ్లీకి టెయిలెండర్ల నుంచి వస్తున్న సహకారాన్ని చూసి ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
మ్యాచ్ అనంతరం భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చిన కర్రాన్ మాట్లాడుతూ... '100పరుగులకే 5 వికెట్లు పడగొట్టడంతో గేమ్ మా సొంతం అనుకున్నాం. కానీ, కోహ్లీ అద్భుతంగా ఆడాడు. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అతనికి చాలా సహకారం అందించారు. వీరంతా మాకు విసుగు తెప్పించారు. నా రెండో గేమ్లోనే కోహ్లీకి బంతులేసే అవకాశం దక్కింది. భవిష్యత్లో అతడికి ఎలాంటి బంతులేయాలో ఈ గేమ్ ద్వారా నాకు అనుభవం వచ్చింది.'
'ఆఫ్ స్టంప్ అవతలి బంతులను కోహ్లీ సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. అతడి వికెట్ కోసం మేము వేసుకున్న ప్లాన్లు సరిగానే అమలయ్యాయి. ఈ రోజు నాకు బాగా కలిసొచ్చింది. ఆదిలోనే మూడు కీలక వికెట్లు దక్కాయి. నమ్మలేకపోయా. పిచ్ అటు బ్యాట్స్మెన్తో పాటు ఇటు బౌలర్లకు సహకరిస్తోంది. దీంతో మిగిలిన మూడు రోజుల ఆట ఆసక్తిగా జరగడం ఖాయం' అని కర్రన్ వివరించాడు.