
హైదరాబాద్: క్రికెట్ను పిచ్చిగా అభిమానిస్తారు. తమ అభిమాన జట్టు ప్రత్యర్ధి జట్టు చేతిలో ఓడిపోయిందంటే చాలు మైదానంలోనే వీరంగం సృష్టిస్తారు. తమ జట్టులోని ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోవడం వల్లే ఓటమిపాలైందంటూ నిందిస్తారు. కొన్నిసార్లు మైదానంలో బాటిళ్లు విసురుతూ.. మ్యాచ్ను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు.
ఇక, దాయాది దేశంతో జరిగిన మ్యాచ్లో ఓడిపోతే, అభిమాన క్రికెటర్ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన రోజులు ఉన్నాయి. అయితే, ఇలాంటి వాటికి భిన్నంగా శ్రీలంక అభిమానులు ప్రవర్తించిన తీరు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వారి ప్రవర్తన అసలు సిసలైన క్రీడాస్పూర్తికి అద్దం పడుతోందని ప్రశంసల వర్షం కురుస్తోంది.
సుదీర్ఘ పర్యటన కోసం సఫారీ జట్టు ప్రస్తుతం శ్రీలంకతో పర్యటిస్తోంది. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో సఫారీలతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్లో శ్రీలంక వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్ను చేజార్చుకుంది.
మూడో వన్డే ఓటమి అనంతరం శ్రీలంక అభిమానులు చేసిన పనికి యావత్ క్రికెట్ ప్రపంచం గర్విస్తోంది. లంక ఓటమి అనంతరం అభిమానులు స్టేడియంలోని చెత్త ఏరుతూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రీలంక క్రికెట్ బోర్డు తన ట్విట్టర్లో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది.
అయితే, ఇలా అభిమానులు క్రీడా స్పూర్తి చాటడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల రష్యా వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్లో జపాన్ అభిమానులు తమ జట్టు ఓడినప్పటికీ, మ్యాచ్ అనంతరం స్టేడియంలోని చెత్తను మొత్తాన్ని శుభ్రం చేశారు. టోర్నీలో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 3-2 తేడాతో జపాన్ ఓటమిపాలైంది.
ఈ ఓటమితో జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. జపాన్ ఓటమి ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేసినా.. వాళ్లు మాత్రం స్టేడియంలోని చెత్తను మొత్తాన్ని శుభ్రం చేశారు. అప్పట్లో జపాన్ సాకర్ అభిమానులు చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది.