
హైదరాబాద్: కాన్ బెర్రా వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచారకర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్మన్ దిముత్ కరుణరత్నేకు బంతి బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన అందరినీ తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
దీంతో 46 పరుగుల వద్ద కరుణరత్నే రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన 31 ఓవర్లో నాలుగో బంతి సుమారు 143 కి.మీ వేగంతో దూసుకురాగా.. కిందికి వంగి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. దీంతో అది మెడ వెనుక భాగాన హెల్మెట్ కింద మెడ భాగంలో బలంగా తగిలింది.

వెంటనే కరుణరత్నే విలవిల్లాడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే వచ్చిన వైద్య సిబ్బంది కరుణరత్నెను స్ట్రెచర్పై మైదానం బయటికి తీసుకెళ్లి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాన్బెర్రా ఆస్పత్రిలో కరుణరత్నేకు చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చారు.
శ్రీలంక స్కోరు 82 పరుగుల వద్ద ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో కరుణరత్నే 46 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 534 పరుగులు చేసి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.