
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. మైదానంలో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న వీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్ విసురుకున్నారు. ఇంతకీ ఆ సవాల్ ఏంటని అనుకుంటున్నారా?
ఈ ఛాలెంజ్ పేరు #SWAGPACK. ప్రముఖ బ్యాగ్ల తయారీ సంస్థ అమెరికన్ టూరిస్టర్కు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఓ బ్యాగ్ను భుజానికి తగిలించుకుని డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత బ్యాగ్ తగిలించుకుని తనకంటే బెటర్గా స్టెప్పులేయాలని శిఖర్ ధావన్కు ఛాలెంజ్ విసిరాడు.
'నా కంటే మెరుగ్గా నువ్వు స్టెప్పులు వేయగలవేమో? నీ స్టెప్పులు చూపించు' అని కోహ్లీ తాను డ్యాన్స్ చేసిన వీడియోని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
కోహ్లీ విసిరిన ఛాలెంజ్ను ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ స్వీకరించాడు. తాను కూడా బ్యాగ్ తగిలించుకుని మీసం మెలేసి, తొడకొట్టి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్లో పంచుకున్న ధావన్.... దిల్జిత్ దోసంజ్ను తన ఛాలెంజ్ను స్వీకరించాల్సిందిగా కోరాడు.
కాగా, ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకతో జరుగుతోన్న ముక్కోణపు టీ20 సిరిస్లో ఆడుతోంది. ఈ సిరిస్కు గాను రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా భారత్ ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ల్లో ఒక దాంట్లో విజయం సాధించగా, మరో మ్యాచ్లో ఓడింది.