
హైదరాబాద్: పాతికేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు కోహ్లీసేన తెరదించింది. సఫారీ గడ్డపై కోహ్లీసేన తొలిసారి వన్డే సిరిస్ను నెగ్గి చరిత్ర సృష్టించింది. పోర్ట్ ఎలిజబెత్లో మంగళవారం జరిగిన ఐదో వన్డేలో సఫారీ జట్టును 73 పరుగులతో ఓడించి సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
చివరి వన్డేలో భారత జట్టు ఓడినా ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. కెప్టెన్గా 48 వన్డే మ్యాచ్లకు నాయకత్వం వహించిన కోహ్లీకి ఇది 37వ విజయం. అంతకాదు టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్లను గెలుచుకొంది. వరుసగా 14 సిరీస్లను కైవసం చేసుకున్న రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని, ఓపెనర్ రోహిత్ శర్మ సెల్పీ ఇంటర్యూ చేశాడు. బీసీసీఐ టీవీ కోసం చేసిన ఈ ఇంటర్యూలో సిరిస్ను గెలుచుకోవడంపై కోహ్లీ పలు అంశాలను ప్రస్తావించాడు. ఈ ఇంటర్యూకి సంబంధించిన ట్వీట్ను బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
ఈ సెల్ఫీ ఇంటర్యూలో రోహిత్ శర్మ... కోహ్లీని ఏమేమి ప్రశ్నలు అడిగాడంటే!:
రోహిత్ శర్మ: పాతికేళ్ల తర్వాత సఫారీ గడ్డపై అద్భుత విజయాన్ని నమోదు చేశాం. ఆతిథ్య దక్షిణాఫ్రికాపై సిరిస్ గెలుపొందడం ఎప్పటికీ సంతోషమే. అయితే సఫారీ గడ్డపై టీమిండియాకు గతంలో సాధ్యం కాని వన్డే సిరీస్ విజయాన్ని సాధించడంపై కెప్టెన్గా, ఆటగాడిగా ఎలా ఫీలవుతున్నావ్?
విరాట్ కోహ్లీ: చాలా ఆనందంగా ఉంది. రోహిత్ ఈ మ్యాచ్లో బాగా ఆడటం కలిసొచ్చింది. చరిత్ర సృష్టించినందుకు గొప్ప ఫీలింగ్గా ఉంది. గతంలో ఆరు సార్లు భారత్ ఇక్కడ పర్యటించినా లాభం లేకపోయింది. 25 ఏళ్ల తర్వాత సఫారీల గడ్డపై భారత్ తొలిసారిగా సిరీస్ విజయం జట్టులో ప్రతి ఒక్కరి శ్రమవల్లే సాధ్యమైంది. అరుదైన సిరీస్ విజయంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. భారత ఆటగాళ్లు ఈ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యారు.
రోహిత్ శర్మ: సఫారీ గడ్డపై సిరిస్ నెగ్గడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ సిరిస్ మొత్తంలో కూడా ఆటగాళ్లు ఒత్తిడిని భలేగా అధిగమించారు. టీమిండియా సిరీస్ విజయానికి కారణాలేమిటి?
విరాట్ కోహ్లీ: ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకరు కీలక ప్రదర్శనతో రాణించారు. ముఖ్యంగా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయి. మణికట్టు స్పిన్నర్లు యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టారు. వీరికి తోడు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్లు నిలకడగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడి చేశారు. నిజంగా ఈ సిరిస్ ఓ హాల్ మార్క్ లాంటిది. దక్షిణాఫ్రికా గడ్డపై 4-1తో సిరిస్ నెగ్గడం అంత ఈజీ కాదు. గతంలోనూ రెండుసార్లు దక్షిణాప్రికాలో ఆడాం. కానీ ఈసారి 4-1 తేడాతో గెలిచామంటే అది అందరి సహకారంతోనే సాధ్యపడింది.. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. ఇది జట్టు సమిష్టి విజయం.
రోహిత్ శర్మ: ఛీర్స్. థాంక్స్ విరాట్. 25 ఏళ్లు. 25 ఏళ్లు.
సఫారీ గడ్డపై కోహ్లీసేన సిరిస్ నెగ్గడంతో రెండేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్ పరాజయానికి సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్ వేదికగా జరుగనుంది.