హైదరాబాద్: సోషల్ మీడియాలో అరుదుగా స్పందించే.. ఎంఎస్ ధోనీ ఆగష్టులో తొలిసారి ట్వీట్ చేశాడు. తన ఎంజాయ్మెంట్ను అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియా విజయాలతో మహీ పాపులారిటీ ఓ రేంజ్లో పెరిగినా.. గతంలో మాదిరిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత ధోనీ మళ్లీ తన సరదాలను తీర్చుకుంటున్నాడు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్న మహీ.. ప్రస్తుతం సొంతూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు.
టీమిండియా మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీకి విహారయాత్రలంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ధోనీ తన స్వస్థలమైన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్నారు. అయితే ధోనీ చాలా కాలం తర్వాత అక్కడి జలపాతం వద్దకు వెళ్లారట. ఈ విషయాన్ని ధోనీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
రాంచీలోని ఓ జలపాతం దగ్గర నిలబడి తలస్నానం చేసిన ధోనీ.. మధుర స్మృతులను గుర్తు తెచ్చుకున్నాడు. 'రాంచీ చుట్టుపక్కల మూడు వాటర్ఫాల్స్ ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేం ఇలా చేసేవాళ్లం. పదేళ్ల తర్వాత ఇలా చేయడం మళ్లీ అలనాటి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చింది. హెడ్ మసాజ్ ఫర్ ఫ్రీ' అంటూ ధోనీ ట్వీట్ చేశాడు. వాటర్ ఫాల్స్ కింద నిలబడి తలస్నానం చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన మిస్టర్ కూల్.. ఆ వీడియో లింకును ట్వీట్ చేశాడు. ధోనీ ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే 3 లక్షలకు మందికిపైగా లైక్లు కొట్టారు.
ధోనీ అలా జలకాలాడుతుంటే 'బాహుబలి' గుర్తుకువస్తోందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన నుంచి భారత్ వచ్చిన ధోనీ ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రకటనలతోనూ బిజీగా ఉన్నారు. ఇంగ్లాండ్లో ధోనీ ప్రదర్శనపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ అనంతరం భారత్ ఆసియాకప్లో ఆడనుంది. ఈ టోర్నీ కోసం ధోనీ జట్టుతో కలుస్తారు.