హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్ కోసం ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనకు ముందు ఈ సిరిస్పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తొలి వన్డేకు ముందు మాజీ క్రికెటర్లు ఈ సిరిస్ హోరా హోరీగా సాగుతుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే, ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే ఏకపక్షంగా సాగింది. టీమిండియా కనీసం పోరాడకుండానే ఆస్ట్రేలియాకు దాసోహమైంది. ఏ దశలో కూడా టీమిండియా తన పోరాటాన్ని కనబర్చలేకపోయింది. తొలి వన్డేలో టీమిండియా ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పెదవి విరిచాడు. టీమిండియా చేసిన తప్పిదాలను తన యూట్యూబ్ ఛానెల్లో ఎండగట్టాడు.
పాంటింగ్, సచిన్లను కోహ్లీ దాటేనా?: ఒక్క సెంచరీతో రెండు రికార్డులు బద్దలు!
"ఇదొక పెద్ద మ్యాచ్. ఏది అత్యుత్తమ జట్టో తేలాల్సిన సందర్భం. అలాంటి మ్యాచ్లో టీమిండియా అవమానకరంగా ఓడిపోయింది. కనీసం పోరాడకుండానే చేతెలెత్తేసింది. వారి బౌలింగ్లో రికార్డు పరుగులు వచ్చాయి. ఒక్క వికెట్ కూడా తీయకుండా ఆసీస్కు లొంగిపోయారు" అని షోయబ్ అక్తర్ అన్నాడు.
"ఈ మ్యాచ్లో టాస్ ఎంతో కీలకం. తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాలో ధావన్ మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. కోహ్లీ 28వ ఓవర్లో రావడమే అర్థం కాలేదు. అక్కడ భాగస్వామ్యాలు నిర్మించినా సరైన పరుగులు రాలేదు. ఇక కీలక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, షమీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు" అని అక్తర్ తెలిపాడు.
"స్పిన్నర్లు సైతం తేలిపోయారు. టీమిండియా తన ప్రదర్శనపై సమీక్షించుకోవాలి. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఆసీస్ టాస్ గెలిస్తే భారత్ ఇలానే ఆడుతుందా? ఒకవేళ టీమిండియా 3-0తో సిరీస్ కోల్పోతే అది ఎంతో అవమానకరం. ఈ మ్యాచ్లో బాగా ఆడాలనే కసి భారత జట్టులో ఏ సందర్భంలోనూ కనపడలేదు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది" అని అక్తర్ అన్నాడు.
సిగ్గు చేటు.. ధోనికి కాంట్రాక్ట్ ఇవ్వరా?: బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
"భారత్ ఇకపై ధాటిగా ఆడకపోతే ఓడిపోతూనే ఉంటారు. ఇకనైనా భారత్ బలంగా పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. టీమిండియాకు ఈ సిరీస్ను 2-1తో గెలిచే అవకాశం ఉంది. అయితే, అది చాలా పెద్ద పని. రెండో వన్డేలో టీమిండియా ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆడాలి. లేకపోతే మళ్లీ ఓడిపోతారు. రెండో మ్యాచ్లో టీమిండియా ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి" అని అక్తర్ చెప్పుకొచ్చాడు.