ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తుది పోరుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమయ్యే టైటిల్ ఫైట్లో న్యూజిలాండ్తో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరడానికి ప్రధాన కారణం సంజూ శాంసన్. పేలవ ఫామ్తో తుది జట్టులో చోటు కోల్పోయిన అతను అనుహ్యంగా జట్టులోకి వచ్చి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. వెస్టిండీస్తో సూపర్-8 మ్యాచ్లో, ఇంగ్లండ్తో సెమీఫైనల్లో భారీ అర్ధశతకాలతో చెలరేగి జట్టును ఫైనల్కు చేర్చాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఛీకొట్టిన నోళ్లతోనే జేజేలు పలికించుకున్నాడు. ఎగతాళి చేసిన కెప్టెన్తో సలామ్ కొట్టించుకున్నాడు.
అయితే సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకురావడానికి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్ద యుద్దమే చేశాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. సెలెక్షన్ కమిటీతో పట్టుబట్టి మరీ సంజూను జట్టులోకి తెచ్చుకున్నాడని చెప్పాడు. ఫైనల్ నేపథ్యంలో పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న అక్తర్.. సంజూ శాంసన్ ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'సంజూ శాంసన్ 2014 నుంచి భారత క్రికెట్లో ఉన్నాడు. కానీ ధోనీ, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ వంటి వికెట్ కీపర్ల కారణంగా అతనికి భారత జట్టులో అవకాశం దక్కలేదు. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవడానికి గౌతమ్ గంభీర్ అందరితోనూ పోరాడాడు. మొదట్లో అతనికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. కానీ కోచ్ గంభీర్ పట్టుబట్టడం వల్లే అతన్ని జట్టులోకి తీసుకున్నారు. గంభీర్ సంజూ శాంసన్ ఎంపిక కోసం చాలా పోరాడాల్సి వచ్చింది. ప్రపంచకప్ ఆరంభంలో భారత తుది జట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కలేదు.’అని అక్తర్ పేర్కొన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ సత్తా చాటడంతో సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోయాడు. అభిషేక్ శర్మ గైర్హాజరీలో అవకాశం లభించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితే సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్లో భారత ఓడిపోవడం.. ఆఫ్ స్పిన్నర్లకు భారత లెఫ్టార్మ్ ఓపెనర్లు ఇబ్బంది పడటంతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సంజూను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వెస్టిండీస్తో చావో రేవో మ్యాచ్లో సంజూ శాంసన్ను ఆడించగా.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్( 97 నాటౌట్)తో భారత్కు విజయాన్నందించాడు.
ఇంగ్లండ్తోనూ 89 పరుగులు చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ టోర్నీలో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన సంజూ శాంసన్ 200 ప్లస్ స్ట్రైక్రేట్తో 232 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్గా కోహ్లీ రికార్డును సమం చేశాడు. అంతేకాకుండా సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్లో అత్యధిక సిక్స్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(15 సిక్స్లు) రికార్డ్ను అధిగమించాడు.