
హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరిస్లో భాగంగా విండిస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. వెస్టిండిస్ జట్టులో కెప్టెన్ స్టెఫానీ టేలర్(94; 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకోగా... నటాషా మెక్లీన్(51) హాఫ్ సెంచరీ సాధించింది.
ఈ మ్యాచ్లో విండిస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ తన కెరీర్లో ఆరో సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. ఏక్తా బిష్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతిని సిక్స్ కొట్టిన టేలర్.. తర్వాతి బంతిని కూడా సిక్స్గా మలిచే యత్నం చేశారు. అయితే, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్కు చేర్చింది.
అమాంతం గాల్లో జంప్ చేసిమరీ హర్మన్ బంతిని ఒడిసి పట్టుకోవడం విశేషం. కెప్టెన్ టేలర్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో మైదానంలోని వెస్టిండిస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత మహిళల జట్టు 224 పరుగులకే కుప్పకూలింది.
భారత జట్టులో ఓపెనర్లు ప్రియా పూనియా(75; 107 బంతుల్లో 6 ఫోర్లు), రోడ్రిగ్స్( 41; 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు శుభారంభాన్ని ఇచ్చినా... మిడిలార్డర్ బ్యాట్స్ఉమెన్ నిరాశపరిచారు. పూనమ్ రౌత్(22), మిథాలీ రాజ్(20), హర్మన్ప్రీత్(5), దీప్తి శర్మ(19)లు తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరడంతో ఒక పరుగు తేడాతో టీమిండియా ఓడిపోయింది.