

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్లో భాగంగా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో కోహ్లీసేన 73 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1తో సిరిస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో వన్డేలో పాండ్యా పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.
ఒంటి చేత్తో పాండ్యా పట్టిన క్యాచ్కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా ఆదిలోనే తడబడింది.
భారత మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేయడంతో 13 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి సఫారీ జట్టు కష్టాల్లో పడింది. అయితే ఇన్నింగ్స్ 42వ ఓవర్లో కుల్దీప్ వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్మన్ తాబ్రిజ్ షంసీ లాంగ్ ఆన్ మీదుగా గాల్లోకి లేపాడు.
బంతిని ఒడిసిపట్టుకునేందుకు పాండ్యా-ధావన్లు పరిగెత్తారు. బంతిని అందుకునే క్రమంలో వీరిద్దరూ ఒకరినిమరొకరు ఢీ కొనబోయారు. అయితే చివరకు ధావన్ వెనక్కి తగ్గి ఆ అవకాశాన్ని పాండ్యాకు ఇచ్చాడు. దీంతో పాండ్యా ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో భారత ఆటగాళ్లు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు.
క్యాచ్ పట్టిన అనంతరం పాండ్యా నవ్వుతూ 'అది నాదే' అని అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఈ సిరిస్లో చివరిదైన ఆరో వన్డే శుక్రవారం సెంచూరియన్ వేదికగా జరగనుంది.