టెక్నిక్ ఏమాత్రం కాదు.. విరాట్ కోహ్లీ వైఫల్యానికి కారణం ఇదే: వసీం జాఫర్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్లో ఎలాంటి సమస్య లేదని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. గత కొంతకాలంగా తన స్థాయికి తగిన పరుగులు చేయకపోవడంతో అతని ఆత్మ విశ్వాసం లోపించిందని తెలిపాడు. అతను ఒక్క సెంచరీ చేస్తే అంతా సెటవుద్దని, మళ్లీ మనం పాత కోహ్లీ చూడవచ్చని చెప్పాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్ట్లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్.. దురదృష్టవశాత్తు 23 పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఒక్క సెంచరీ చేస్తే..
ఈ క్రమంలోనే విరాట్ బ్యాటింగ్ టెక్నిక్పై దృష్టిసారించాలని, షాట్ సెలెక్షన్ కూడా మార్చుకోవాలని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సూచించారు. ఈ క్రమంలోనే ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై మాట్లాడిన జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్లో ఎలాంటి సమస్యలు లేవు. గత కొద్ది రోజులుగా అతను పరుగులు చేయలేకపోయాడు. దాంతో అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. దాంతోనే మనమంతా కోహ్లీ నుంచి ఆశిస్తున్న పరుగులు రావడం లేదు. ఒక్కసారి అతను సెంచరీ సాధిస్తే అంతా సెట్ అవుతుంది. ఫామ్లోకి వస్తాడు. అప్పుడు మనం మళ్లీ పాత కోహ్లీని ఖచ్చితంగా చూస్తాం'అని జాఫర్ పేర్కొన్నాడు.

శ్రేయస్ అయ్యర్ది గొప్ప ఇన్నింగ్స్..
బ్యాటింగ్కు ప్రతికూలమైన ట్రాక్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్పై జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ క్రికెట్లో ఇటీవల భారత బ్యాట్స్మెన్ ఆడిన వాటిలో అయ్యర్ ఇన్నింగ్స్ గొప్పదని కొనియాడాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఇటీవల రిషభ్ పంత్ ఆడాడని, అయ్యర్ది అతని కంటే గొప్ప ఇన్నింగ్స్ అని ప్రశంసించాడు. 'ఇటీవల భారత బ్యాట్స్మెన్ ఆడిన ఇన్నింగ్స్ల్లో శ్రేయస్ అయ్యర్ది గొప్పది. ఇలాంటి నాక్స్ ఇటీవల కాలంలో రిషభ్ పంత్ నుంచి చూశాం. కానీ మ్యాచ్ పరిస్థితులు, ప్రతికూలమైన పిచ్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ది అంతకంటే గొప్ప ఇన్నింగ్స్'అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
బూమ్ బూమ్ బుమ్రా...
బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో బ్యాట్తో, బంతితో భారత్ సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా(5/24) ఐదు వికెట్లతో చెలరేగడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్కు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 31 ఓవర్లలో రెండు విక్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. మరోసారి మయాంక్ అగర్వాల్(22) నిరాశపర్చగా.. రోహిత్ శర్మ(46) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ(2 బ్యాటింగ్)తో హనుమ విహారి(29 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తున్నాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 31 ఓవర్లలో 100/2 ( రోహిత్ శర్మ 46, మయాంక్ అగర్వాల్ 22)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications