
హైదరాబాద్: విరుచుకుపడి ఆడిన విదర్భ ఆటగాడు వసీం జాఫర్ ట్రిపుల్ సెంచరీకి చేరువ అవుతుండగా అవుటయ్యాడు. ఇరానీ కప్లో భాగంగా జరుగుతున్న విదర్భ, రెస్టాఫ్ ఇండియాల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. లేటు వయసులో కూడా కుర్రాళ్లకు ధీటుగా బదులిచ్చిన 40ఏళ్ల విదర్భ ఆటగాడు వసీం జాఫర్ ట్రిపుల్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు.
వర్షం అంతరాయం, వెలుతురులేమి, వాతావరణ పరిస్థితులు ఆటంకం కలిగించడంతో ఏకాగ్రత కోల్పోయిన జాఫర్ మూడో రోజు ఆటలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు. ఓవర్నైట్ స్కోరు 598/3తో జాఫర్, అపూర్వ వాంఖడే ఇన్నింగ్స్ ఆరంభించారు. జాఫర్ మూడోరోజు ఆటలో మరిన్ని పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ సాధించాలనుకున్న అతని ఆశ నెరవేరలేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సిద్ధార్థ కౌల్ బౌలింగ్లో బౌల్డయ్యాడు.
ఇరానీ ట్రోఫీ చరిత్రలోనే జాఫర్ సాధించిన 286 అత్యధిక స్కోరు కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో 18వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భారత ఆటగాడిగా జాఫర్ రికార్డు సాధించాడు. జాఫర్ 2009 సంవత్సరంలోనే 200 మించిన పరుగులు నమోదు చేశాడు. ఇలా ద్విశతకం నమోదు చేయడం జాఫర్కు ఇది ఎనిమిదో సారి.
ప్రస్తుతం 200 ఓవర్లు ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 663 పరుగులు చేసింది. అపూర్వ వాంఖడే(82), అక్షయ్ వాడేకర్(20) క్రీజులో ఉన్నారు. 700 స్కోరు దాటగానే విదర్భ డిక్లేర్ చేసే అవకాశముంది. విదర్భ జట్టులో ఫెయిజ్ ఫజల్(88), సంజయ్ రామస్వామి(53), గణేశ్ సతీశ్(120) భారీ స్కోరు సాధించారు.