
నాగపూర్: భారత వెటరన్ బ్యాట్స్మన్, మాజీ టీమిండియా ఓపెనర్ వసీం జాఫర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో 12,000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా అరుదైన రికార్డు సాధించాడు. కేరళతో మంగళవారం ఆరంభమైన మ్యాచ్లో విదర్భ బ్యాట్స్మన్ జాఫర్ 57 పరుగులు చేసి కెరీర్లో ఈ అరుదైన మైలురాయుని చేరుకొన్నాడు. ఇక రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం ఇక్కడ మరో విశేషం.
2019-20 సీజన్ ఆరంభానికి ముందు రంజీల్లో జాఫర్ ఖాతాలో 11,775 పరుగులు ఉన్నాయి. సీజన్ ఆరంభంలో 150వ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడి చరిత్ర సృష్టించాడు. 1996-97లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్.. క్రికెట్పై ఇష్టంతో కుర్రాళ్లతో పోటీపడి మరీ పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే 20 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోనే దేశవాళీ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్గా నిలిచాడు.
రంజీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో జాఫర్ తర్వాతి స్థానాల్లో దేవేంద్ర బుందేల (145), అమోల్ ముజుందర్ (136) ఉన్నారు. జాఫర్ చివరిసారిగా 2008లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై, విదర్భ తరఫున వసీం మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యాడు.
జాఫర్తో పాటు జ్ఞానేష్ (58), సిద్దేశ్ (43) రాణించడంతో.. తొలి రోజు ఆటముగిసే సమయానికి విదర్భ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 1996-97 రంజీ సీజన్లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన జాఫర్.. సుదీర్ఘ కెరీర్లో 40 శతకాలు బాదాడు. భారత్ తరఫున జాఫర్ 31 టెస్టులు, రెండు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో వెస్టిండీస్ (212), పాకిస్థాన్పై( 202) డబుల్ సెంచరీలు సాధించాడు.