కరాచీ: అభిమానులు లేకుండా టీ20 ప్రపంచకప్ను నిర్వహించడం అస్సలు ఊహించుకోలేనని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించే కన్నా.. కరోనా వైరస్ మహమ్మారి తగ్గినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం మేలని ఆయన సూచన చేసాడు. పాక్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అక్రమ్ పాక్ తరఫున 104 టెస్టులు, 356 వన్డేలు ఆడాడు.
'మ్యాచ్ గురించి పట్టించుకోకుండా.. సచిన్, ద్రవిడ్, గంగూలీని అలా చూస్తుండిపోయా'
తాజాగా 'ది న్యూస్'తో వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ... 'వ్యక్తిగతంగా మంచి ఆలోచన కాదని నా భావన. అభిమానులు లేకుండా టీ20 ప్రపంచకప్ ఎలా నిర్వహిస్తారు. మెగాటోర్నీ అంటేనే భారీ జన సందోహం ఉంటుంది. తమ జట్లకు మద్దతు ఇచ్చేందుకు అనేక దేశాల నుంచి ప్రేక్షకులు వస్తారు. అదొక ప్రత్యేక వాతావరణం. ఖాళీ స్టేడియాల్లో అది సాధ్యమవ్వదు. అందుకే ఐసీసీ కొన్ని రోజులు వేచి చూడాలి. వైరస్ తగ్గుముఖం పట్టాక టోర్నీ నిర్వహిస్తే బాగుంటుంది' అని అన్నాడు.
క్రికెట్ బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు ఉమ్మిని వాడటం ఐసీసీ తాత్కాలికంగా నిషేధించడంపై అక్రమ్ స్పందించాడు. ఈ నిషేధం పేసర్లకు కొంచెం కష్టమేనన్నాడు. ఇందుకు పరిష్కారం కనుక్కోవాలని ఐసీసీకి సూచించాడు. 'ఫాస్ట్ బౌలర్లు ఈ నిబంధన ఇష్టపడరని తెలుసు. బంతిపై చెమటను రుద్దేందుకు మాత్రం అనుమతించారు. అయితే ఇది ఉమ్మిలా కాదు. ఎక్కువగా రుద్దితే బంతి తడిగా అవుతుంది. ఐసీసీ త్వరగా ఒక సరైన పరిష్కారం కనుక్కోవాలి' అని పాక్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అక్రమ్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా అనేక దేశాలు లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఆస్ట్రేలియాలో అయితే అక్టోబర్ నెల వరకు ప్రయాణ ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. మెగా టోర్నీని ఐసీసీ వాయిదా వేస్తారని సమాచారం. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టోర్నీ నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. మే 28నే మెగాటోర్నీ భవితవ్యం తేలాల్సింది. కానీ జూన్ 10కి నిర్ణయాన్ని ఐసీసీ వాయిదా వేసింది.
ఇటీవల అక్రమ్ మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లిష్ కౌంటీలు ఆడటం కంటే విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్న బుమ్రాకు ఇంగ్లిష్ కౌంటీ ఆడాల్సిన అవసరం ఏమాత్రం లేదని అభిప్రాయపడ్డాడు. 'బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో టాప్ బౌలర్. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ఇప్పటికే మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. మా కాలంలో పోలిస్తే.. ఇప్పుడు కౌంటీ క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో అతను విశ్రాంతి తీసుకుంటే ఉత్తమం' అని అక్రమ్ పేర్కొన్నాడు.