

లండన్: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. సుదీర్ఘ పర్యటన కోసం ఎదురు చూస్తోంది. వచ్చేనెల 4వ తేదీన అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆరంభమౌతుంది. సెప్టెంబర్ 14వ తేదీన ఈ చివరి మ్యాచ్ ముగుస్తుంది. అప్పటిదాకా ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడుతోంది కోహ్లీసేన. ప్రాక్టీస్ మ్యాచ్లో దుర్హామ్లో ప్రస్తుతం కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ను ఢీ కొంటోంది.
అంతా బాగానే ఉన్నప్పటికీ- టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటం జట్టుకు పెద్ద దెబ్బే. వేలికి ఫ్రాక్చర్ కావడం వల్ల ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని ఫిజియోథెరపిస్టులు సూచించారు. ఫలితంగా- ఇంగ్లాండ్తో జరిగే అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు దూరం అయ్యాడంటూ వార్తలొచ్చాయి. అతని స్థానంలో మరో ప్లేయర్ను పంపిస్తామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్లడించలేదు. రీప్లేస్ ఉండకపోవచ్చనే సంకేతాలను పంపించింది.
ఇక్కడిదాకా అంతా ఓకే. ఆ తరువాతే అసలు కథ మొదలైంది. వేలికి గాయం కావడం వల్ల రెస్ట్ తీసుకోవాల్సిన వాషింగ్టన్ సుందర్.. ఫీల్డ్లో ప్రత్యక్షం అయ్యాడు. ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. డైవ్లు కొడుతూ, అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం క్రికెట్ జనాన్ని గందరగోళానికి గురి చేసింది. వందశాతం ఫిట్గా ఉండాలంటే కనీసం ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన రేంజ్లో గాయమైన వేలితో.. వాషింగ్టన్ సుందర్ ఎలా ఫీల్డింగ్ చేయగలుగుతున్నాడనే కన్ఫ్యూజన్ నెటిజన్లలో నెలకొంది.
వాషింగ్టన్ సుందర్ గాయపడ్డట్టు వచ్చిన వార్తలు బేస్లెస్, ఫాల్స్ న్యూస్గా కామెంట్స్ చేస్తోన్నారు. కొందరు దీన్ని డ్రామాగా కామెంట్స్ చేస్తోండగా.. మరికొందరు సూపర్ మేన్ అంటూ సెటైర్లు సంధిస్తోన్నారు. అతను నిజంగా గాయపడ్డాడా? లేక డ్రామా ఆడుతున్నాడా? అనే విషయంపై బీసీసీఐ స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తోన్నారు. నిజంగా గాయపడి ఉంటే- అంత సాహసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిలదీస్తోన్నారు.