న్యూఢిల్లీ: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్దంగా ఉంటానని టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషిస్తున్న సుందర్.. శనివారం జరిగే మూడో వన్డేకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు.
'జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్దం. అందుకోసం నేను ప్రత్యేకంగా దృష్టిసారించా. గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోంది. వచ్చే కాలంలోనూ ఇదే విధంగా ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. రెండో వన్డేలో నాలుగో స్థానంలో రావడం మంచి అవకాశం దక్కినట్లే. వచ్చే ఏడాది ప్రపంచకప్ జరగనుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే ప్లేయర్ల జాబితాలో ఉండేందుకు ఇష్టపడతా. మేనేజ్మెంట్ కోరుకున్న విధంగా ఏ స్థానంలోనైనా ఆడతా.
నా శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తా. నేను బాగా ఆడినప్పుడు చాలా మ్యాచుల్లో జట్టు విజయాలు సాధించింది. ఇక బంగ్లాతో రెండు వన్డేల్లోనూ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఓడిపోయాం. తొలి వన్డేలో అయితే 50 పరుగులు ఉన్నా.. వికెట్ తీయలేకపోయాం. రెండో మ్యాచ్లో 70 పరుగులకే ఆరు వికెట్లు తీసినా అదే ఊపు కొనసాగించలేకపోయాం. శ్రేయస్-అక్షర్ పటేల్ భాగస్వామ్యం ఉన్నప్పుడు గెలుస్తామని భావించా. చివరి వరకు అద్భుతంగా పోరాడిన రోహిత్ శర్మ ప్రదర్శన అసాధారణం.
బంగ్లాదేశ్ను సొంతగడ్డపై ఢీకొట్టడం సులువేం కాదు. ఆటగాళ్లు గాయపడటం కూడా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే వాటన్నింటిని అధిగమించి చివరి వన్డేలో విజయం సాధిస్తాం. రాహుల్ ద్రవిడ్ చాలా అనుభవం కలిగిన వ్యక్తి. వన్డే ఫార్మాట్లో ఎన్నో అద్భుతాలు సాధించాడు. ఎలాంటి సందేహం ఉన్నా అతనితో మాట్లాడితే పరిష్కారం చూపిస్తాడు'అని వాషింగ్టన్ సుందర్ చెప్పుకొచ్చాడు.