
హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు వినోదాత్మకంగా ఉండేదని.. ఇప్పుడు సీరియస్గా మారిందని మీడియం పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.ఒక అంతర్జాతీయ మ్యాచ్కు ఏమాత్రం తగ్గని రీతిలో బలమైన పోటీ, ఆటగాళ్ల ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి దృష్టి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ వేలంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపించిందని పఠాన్ అన్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో వ్యాఖ్యాతగా కనిపించనున్నట్లు ప్రకటించాడు. మరోవైపు లీగ్ను ఆకర్షణీయంగా మార్చేందుకు పఠాన్ మరో సూచన చేశాడు. న్యూజిలాండ్లో ఉన్న తరహాలో మైదానంలో ప్రేక్షకులు క్యాచ్ పట్టే అవకాశం ఇచ్చి బహుమతులతో ప్రోత్సహించాలని అన్నాడు.
'చర్చ కార్యక్రమం ద్వారా ఐపీఎల్లో భాగమవడం ఆనందంగా ఉంది. వేలం పాటలో ఏ జట్టూ నన్ను తీసుకోకపోవడం బాధించలేదు. దేశవాళీ క్రికెట్లో నా ప్రదర్శన ఏమంత బాగోలేదు. అలాంటప్పుడు ఫ్రాంచైజీలు నన్నెలా తీసుకుంటాయి! 2008లో ఐపీఎల్ అంటే వినోదం. ఇప్పుడు సీరియస్ క్రికెట్గా మారింది. పోటీ పెరిగింది. వచ్చే ఏడాది దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి మళ్ళీ టీమిండియాలో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తా. రానున్న సీజన్లో జమ్మూకాశ్మీర్కు ఆడే అవకాశముంది' అని ఇర్ఫాన్ వివరించాడు.
భారత జట్టులో పాల్గొనాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉందని.. ఈ ఏడాది కోల్పోయిన అవకాశాన్ని వచ్చే ఏడాది పొందేందుకు కష్టపడతానని అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆడుతున్న లీగ్లలో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.
ఇంకా మాట్లాడుతూ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు బరోడా క్రికెట్లో ఈ ఏడాది అవకాశం రాలేదు. నేను ఇంకా పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాను. ఎక్కడైతే స్వేచ్ఛగా ఆడగలనో అక్కడే స్థానం సంపాదించేందుకు కష్టపడుతున్నాను. ఐపీఎల్ నన్ను కొనుగోలు చేయరని ముందుగానే ఊహించాను. అలాగే జరిగింది' అని వివరించాడు.