అలాగే చూస్తుండిపోయా
తాజాగా తమిమ్ ఇక్బాల్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్తో మాట్లాడుతూ ఆనాటి విశేషాలు పంచుకున్నాడు. 'ఆ మ్యాచ్లో నా అభిమాన ఆటగాళ్లు సచిన్, ద్రవిడ్, గంగూలీని అలాగే చూస్తుండిపోయా. మ్యాచ్ గురించి పట్టించుకోకుండా వాళ్లని తదేకంగా గమనించా. వారు భారత క్రికెట్లో ఎవర్గ్రీన్ ఆటగాళ్లు. ముగ్గురు నా ఆరాధ్య క్రికెటర్లు. దిగ్గజాల సమక్షంలో ఆడడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది' అని తమిమ్ పేర్కొన్నాడు. ఇక్బాల్ బంగ్లా తరఫున 60 టెస్టులు, 207 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.
ఏదోలా మేనేజ్ చేశా
'ఆ మ్యాచ్లో భారత్ 191 పరుగులే చేయడంతో మేం గెలుస్తామనే నమ్మకం కలిగింది. నేను ఓపెనర్గా దిగేసరికి జహీర్ ఖాన్ బంతిని అందుకున్నాడు. దాంతో 140 కిమీ వేగంతో బంతులేసే బౌలర్ను ఎదుర్కోగలనా? అని మనసులో అనుకున్నా. జహీర్ తొలి బంతి వేసాడు, ఏదోలా మేనేజ్ చేశా. తర్వాతి బంతికే ఫోర్ కొట్టా. దాంతో నాకు నమ్మకం కలిగింది. భారత దిగ్గజాలతో కలిసి ఆడడం సంతోషంగా అనిపించింది' అని తమిమ్ చెప్పాడు. ఇక భారత్పై ఆ విజయం బంగ్లాదేశ్ క్రికెట్లో గొప్ప విశేషమని, ఆ విజయంతో బంగ్లా అభిమానులకు తమ జట్టుపై నమ్మకం కలిగిందన్నాడు.
191 పరుగులకు ఆలౌట్
లీగ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. గంగూలీ (66), యువరాజ్ (47) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాట్స్మెన్ పరుగులు చేయలేకపోయారు. అయినా కూడా భారత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఛేదనలో బంగ్లా 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. ఓపెనర్ తమిమ్ (51), ముష్ఫికర్ రహీమ్ (56), షకిబ్ అల్ హసన్ (53) అర్ధ శతకాలతో రాణించడంతో బంగ్లా గెలుపొందింది.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్
తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ తరపున ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. తమీమ్ 136 బంతుల్లో 158 పరుగులు చేసి బంగ్లా తరపున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. గతంలో తమీమ్ 132 పరుగులు చేసాడు. ఇప్పటివరకు ముష్ఫికర్ రహీమ్ చేసిన 144 పరుగులే అత్యధికం. ఇమ్రుల్ కాయెస్ (144), షకీబ్ అల్ హసన్ (132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డే ఫార్మాట్లో 7,000 పరుగులు సాధించిన తొలి బంగ్లా క్రికెటర్గా తమీమ్ రికార్డులోకి ఎక్కాడు. ప్రస్తుతం తమీమ్ ఖాతాలో 7,202 పరుగులు ఉన్నాయి.