హైదరాబాద్: 2006లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో జోహెన్స్బర్గ్ వేదికగా జరిగిన టెస్టులో చోటు చేసుకున్న ఓ సంఘటనను సఫారీ మాజీ పేస్ బౌలర్ ఆండ్రీ నెల్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. సఫారీ గడ్డపై టీమిండియా గెలిచిన రెండో టెస్టు మ్యాచ్ ఇది. ఈ టెస్టు మ్యాచ్ సందర్భంగా టీమిండియా పేసర్ శ్రీశాంత్ను తలపై బలంగా కొట్టాలన్న కసి వచ్చిందని, ఎందుకంటే ఆ టెస్టులో మేము ఓటమి పాలవ్వడానికి కారణం అతడేనని నెల్ తాజాగా వెల్లడించాడు.
క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్యూలో అప్పటి టెస్టు మ్యాచ్లో చోటు చేసుకున్న జ్ఞాపకాలపై ఆండ్రీ నెల్ మాట్లాడుతూ 'నేను బ్యాట్స్మన్ను కవ్వించే క్రమంలో శ్రీశాంత్తో ముందుగా స్లెడ్డింగ్కు దిగా. అయితే అప్పుడు నేను ఏమని వ్యాఖ్యానించానో గుర్తులేదు. కాకపోతే శ్రీశాంత్ను బాగా రెచ్చగొట్టా. నేను రెచ్చగొట్టిన తర్వాత బంతిని శ్రీశాంత్ స్టైట్గా సిక్స్గా మలిచాడు' అని చెప్పాడు.
'అనంతరం పిచ్ మధ్యకు వచ్చి శ్రీశాంత్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరహా సెలబ్రేషన్ను గతంలో ఎన్నడూ నేను చూడలేదు. ఆ సమయంలో శ్రీశాంత్ తలపై బలంగా కొడదామనేంత ఆవేశం వచ్చింది. ఆ తర్వాత కూల్ కావడంతో ఎటువంటి వివాదం జరగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీశాంత్ దగ్గరకు వెళ్లి షేక్హ్యాండ్ ఇచ్చా. డ్రస్సింగ్ రూమ్లో ఉన్న శ్రీశాంత్ను చూడగానే నాకు నవ్వొచ్చింది' అని పేర్కొన్నాడు.
'ఆ క్రమంలో మేమిద్దరం నవ్వుకున్నాం. దూకుడుగా ఉండటం నాకు కూడా ఇష్టమే. శ్రీశాంత్తో ఈ వివాదం తలచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తోంది. ఇటువంటి ఘటనలు కనీసం చెప్పకోవడానికి ఉండాలి. నేను కవ్వించిన తర్వాత బంతిని సిక్స్గా కొట్టడాన్ని శ్రీశాంత్ బాగా ఎంజాయ్ చేసుంటాడు. నిజంగా చాలా సరదాగా ఉండే మనస్తత్వం శ్రీశాంత్ది' అని నెల్ ఆనాటి టెస్టు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
ఈ టెస్టు సిరిస్ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. ఈ సిరిస్లో శ్రీశాంత్ తన స్వింగ్, షార్ట్ డెలివరీస్తో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లకు ముచ్చెమటలు పోయించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీశాంత్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు 165 పరుగుల ఆధిక్యం లభించింది.
2006 (డిసెంబర్ 15-18 వరకు), జోహెన్స్ బర్గ్ టెస్టు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 249 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 84 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 236 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 278 ఆలౌట్
మ్యాచ్ ఫలితం: 123 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.
కాగా, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను మరో టెస్టు మిగిలుండగానే డుప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు 2-0తో సిరిస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్బర్గ్లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.