
హైదరాబాద్: కొద్ది నెలలుగా పెద్దగా రాణించలేకపోతున్న శ్రీలంక జట్టు ఆఖరు సిరీస్తో కొద్దిగా కోలుకుంది. భారత్తో వరుస పరాజయాల అనంతరం బంగ్లాదేశ్తో సమరానికి పయనమైంది. అక్కడా అదే పరిస్థితి నెలకొనడంతో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించింది.
బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ను 1-0తో గెలుచుకుంది లంక జట్టు. తొలి టెస్టు మ్యాచ్ను డ్రా చేసుకున్న లంకేయులు.. రెండో టెస్టులో 215 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే రెండు ట్వంటీ 20ల సిరీస్కు శ్రీలంక సిద్ధమవుతోంది.
ఈరోజు(గురువారం) ఢాకాలో ఇరు జట్ల మధ్య తొలి టీ 20 జరుగనుంది. దానిలో భాగంగా లంక ఆటగాడు ఉపుల్ తరంగా మాట్లాడుతూ.. టెస్టు సిరీస్లో ప్రదర్శననే టీ 20 సిరీస్లో కూడా పునరావృతం చేస్తామంటున్నాడు. ఢాకాలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది కచ్చితంగా చెప్పలేమని తెలిపిన తరంగా మంచి వికెటే ఎదురవుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
'టెస్టు సిరీస్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే టీ 20 సిరీస్కు సన్నద్ధమవుతున్నాం. ఈ సిరీస్ మాకు చాలా ముఖ్యం. దాదాపు ఏడాదిన్నర కాలంగా మా జట్టులో నిలకడ లోపించింది. మేము నిలకడను అందిపుచ్చుకోవాలంటే బంగ్లాతో టీ 20 సిరీస్ సాధించడం ఎంతో అవసరం. సిరీస్ను గెలుస్తామని ఆశిస్తున్నా' అని తరంగా పేర్కొన్నాడు.