దుబాయిలో కఠోర సాధన చేస్తున్న స్మిత్ సేన
చివరిసారిగా 2013లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్ కోల్పోయింది. అయితే ఈసారి భారత్ను భారత్లో ఓడించాలనే ప్రయత్నాల్లో భాగంగా దుబాయిలో కఠోర సాధనకు నిర్ణయించుకుంది. ఉపఖండ పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధమయ్యేందుకు దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో స్టీవ్ స్మిత్ సేన శిక్షణ పొందుతుంది.
ఐసీసీ అకాడమీలో శిక్షణ
ఇక్కడ వివిధ రకాల పిచ్లపై ఆటగాళ్లు విభిన్నంగా సన్నద్ధమవుతారని క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఫర్ఫామెన్స్ అధికారి పాట్ హోవర్డ్ తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆటగాళ్ల ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్లో పోస్టు చేసింది. భారత పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియాకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్
భారత పిచ్లపై తమ జట్టు భారీ స్కోరు చేయడం గట్టి సవాల్తో కూడుకుందని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి మాథ్యూ హేడెన్, డామియన్ మార్టిన్లా ఎవరో ఒకరు నిలదొక్కుకుని ఈ సమస్య తీరుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్తో సిరీస్లో కోహ్లి పరుగుల వరద పారించాడు. రాబోయే సిరీస్లో అతణ్ని ఆపాలంటే ఆస్ట్రేలియా మరింత కసరత్తు చేయక తప్పదని పేర్కొన్నాడు. బంతిని సరైన దిశలో వేయాలని, పిచ్ స్థితిని బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని అన్నాడు. తమ పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా భారత పిచ్లపై బౌలింగ్ చేయడం సవాల్నని చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ స్టీవ్ స్మిత్కు పెద్ద పరీక్షే
ఆస్ట్రేలియా మాజీ వికెట్కీపర్ బ్రాడ్ హడిన్ మాట్లాడుతూ భారత పర్యటన కెప్టెన్ స్టీవ్ స్మిత్కు పెద్ద పరీక్షేనని పేర్కొన్నాడు. భారత్తో టెస్టు సిరీస్ ఆస్ట్రేలియాకు అంత సులువు కాదని అన్నాడు. మెరుగైన ప్రదర్శన చేయాలంటే కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్లోనే కాదు కెప్టెన్సీలోనూ రాణించాలని సూచించాడు. భారత్లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్) సలహాలు కూడా అతనికి ఉపయోగపడతాయన్నాడు.