హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి. వివేకానంద వర్గం క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం రాత్రి ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ అధికారి కే రాజీవ్రెడ్డి ప్రకటించారు. హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా వివేక్ ఎన్నికయ్యారు.
వివేక్ ప్యానెల్ ఆరు స్థానాల్లో ఘన విజయం సాధించింది. శుక్రవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తన ప్రత్యర్థి, మాజీ క్రికెటర్ విద్యుత జయసింహపై 67 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వివేక్కు 136 ఓట్లు రాగా, విద్యుతకు కేవలం 69 ఓట్లే వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా వివేకానంద ప్యానెల్కు చెందిన అనిల్ కుమార్.. ఇమ్రాన్ మహమూద్ను ఓడించారు.
అనిల్కు 138 ఓట్లు రాగా ఇమ్రాన్కు 86 ఓట్లు వచ్చాయి. సంయుక్త కార్యదర్శిగా వివేకానంద ప్యానెల్కు చెందిన అజ్మల్ అసద్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శి బరిలో నిలిచిన వంకా ప్రతాప్కు నిరాశే ఎదురైంది. అతను అజ్మల్ అసద్ చేతిలో ఓడిపోయాడు. ప్రతా్పకు 80 ఓట్లు రాగా, 124 ఓట్లు దక్కించుకున్న అజ్మల్ అసద్ గెలుపొందాడు.
కోశాధికారిగా మహేందర్, ఈసీ సభ్యుడిగా హన్మంతరెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా వివేక్ ప్యానెల్ అభ్యర్థి పి. మహేందర్ 148 ఓట్లు సాధించగా.. అతని ప్రత్యర్థి అనూరాధ కేవలం 54 ఓట్లకే పరిమితం అయింది. ఈసీ సభ్యుడిగా ఎన్నికైన హన్మంత రెడ్డికి వంద ఓట్లు వచ్చాయి.
ఇక హెచ్సీఏ ప్రధాన కార్యదర్శిగా వివేక్ ప్యానెల్కు చెందిన శేష్ నారాయణ జనవరి 17న జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆరుగురు ఆఫీస్ బేరర్లతో కూడిన ఈ నూతన కార్యవర్గం మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది. పురుష, మహిళా క్రికెట్ నుంచి ఒక్కొక్కరిని సంఘం కార్యవర్గానికి నామినేట్ చేస్తారు.
కాగా, జనవరి 17న ఈ ఎన్నికలు జరగగా, హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం గురువారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్వకేట్ కమిషనర్ కే రాజీవ్ రెడ్డి సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకూ సాగింది.
ఓట్ల లెక్కింపు అనంతరం హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వివేకానంద మాట్లాడుతూ మళ్లీ హైదరాబాద్ క్రికెట్ సంఘానికి పూర్వ వైభవం తీసుకువస్తానని చెప్పారు. అవినీతి, బంధుప్రీతికి తావివ్వకుండా క్రికెట్ అభివృద్ధికి పాటుపడతానని చెప్పా రు. గ్రామాల్లో ప్రతిభ కలిగి న క్రీడాకారులను వెలికితీసి వారికి తగిన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.