న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా నవ్వులు పూయించాడు. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే సెహ్వాగ్.. ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ముఖ్యంగా భారత్లో క్రీడాకారులకు దక్కే గౌరవాలను ప్రస్తావిస్తూ సెటైరికల్ మీమ్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ను గెలుచుకున్న అర్జెంటినా 36 ఏళ్ల నీరక్షణకు తెరిదించింది. అప్పుడెప్పుడో 1986లో ప్రపంచకప్ ముద్దాడిన ఆ జట్టు.. మళ్లీ ఇన్నాళ్లకు మెస్సీ పుణ్యమా ఛాంపియన్గా నిలిచింది. కెరీర్లో అన్ని ఘనతలను అందుకొని ఒక్క ప్రపంచకప్ కోసమే ఎదురు చూసి మెస్సీ ఆ కలను కూడా నెరవేర్చుకున్నాడు. గత ఆదివారం జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2తో షూటౌట్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ను ఓడించింది. నిర్ణీత సమయం, ఎక్స్ట్రా సమయంలోనూ స్కోర్లు సమంగా ఉండటంతో మ్యాచ్ ఫలితాన్ని షూటౌట్ ద్వారా తేల్చారు.
అయితే అర్జెంటినా విజయంలో కీలక పాత్ర పోషించిన మెస్పీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే మెస్సీని కొనియాడిన సెహ్వాగ్.. మరోపోస్ట్లో ఓ ఫన్నీ మీమ్ షేర్ చేశాడు. ఈ పోస్ట్లో మెస్సీ పోలీస్ డ్రెస్స్ వేసుకొని ఉన్న ఫొటోను జత చేశాడు. 'మెస్సీ భారత్లో జన్మించి ఉంటే ప్రపంచకప్ గెలిచిన తర్వాత సర్కారీ కొలువు అందుకునేవాడు'అని క్యాప్షన్ ఇచ్చాడు. భారత్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సర్వసాధారణం. ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు, ఇతర అథ్లెట్లు ప్రభుత్వ ఉద్యోగాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చాడు.
ప్రపంచకప్లో ఏడు గోల్స్ నమోదు చేసిన మెస్సీ గోల్డెన్ బాల్ అందుకున్నాడు. టోర్నమెంట్ అంతటా గాయంతో బాధపడినా.. అసాధారణ ప్రదర్శనతో అర్జెంటీనా జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.