టీమిండియా వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్ గనుక తన కెరీర్లో 100టెస్టులు ఆడగలిగితే.. అతని పేరు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 2020-21ఆస్ట్రేలియా సిరీస్ నుంచి రిషబ్ పంత్ టీమిండియా తరఫున ఎంపికయ్యే వికెట్ కీపర్ లిస్టులో తొలి ఎంపికగా ఉన్నాడు. ఢిల్లీకి చెందిన పంత్ గత 15 నెలలుగా టీమిండియా తరఫున టెస్ట్ బ్యాటర్లలో కీలక బ్యాటర్గా మారాడు. 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్లో 97పరుగులు చేసి మ్యాచ్ డ్రా చేయడంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం గబ్బాలో అజేయంగా 89పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతిష్ఠాత్మక సిరీస్ గెలవగలిగింది.
'పంత్ గనుక 100 కంటే ఎక్కువ టెస్టులు ఆడితే అతని పేరు చరిత్రపుటల్లోకి ఎక్కడం ఖాయం. కేవలం 11మంది టీమిండియా క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఎప్పటికీ వారి పేర్లు నిలిచే ఉంటాయి. టీ20లు, వన్డేలలో మ్యాచ్లు గెలవడం తక్షణ సంతృప్తినిస్తాయి. కానీ టెస్టుల్లో మీరు ఎలాంటి ప్రదర్శన చేశారో దాన్ని ప్రజలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు.' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. పంత్ ఇప్పటివరకు 30టెస్టులు ఆడి 40.85సగటుతో 1920పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో టెస్టు మ్యాచ్లు ఆడి సెంచరీలు నమోదు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్గా పంత్ ప్రత్యేక రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ చేయబడిన ఐదో టెస్ట్ మ్యాచ్లో పంత్ రాణించగలిగే అవకాశం ఉంది. ఈ టెస్టు కోసం టీమిండియా ఇంగ్లాండ్ కు వెళ్లనుంది. ఈ టెస్ట్లో పంత్ నుంచి కీలక ఇన్నింగ్స్ ఆశించొచ్చు. ఇప్పటికే భారత్ ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది.
ఇకపోతే రిషబ్ పంత్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్.. తన చివరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తో ఓడిపోయి ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయింది. ఇక పంత్ ఆ మ్యాచ్లో టిమ్ డేవిడ్కు సంబంధించిన కీపర్ క్యాచ్ రివ్యూ కోరుకోవడంలో అలసత్వం ప్రదర్శించడంతో గెలిచే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక టీమిండియా టెస్టు జట్టుకు తదుపరి కెప్టెన్గా రిషబ్ పంత్ను చేయాలని క్రికెట్ ప్రముఖుల నుంచి అభిప్రాయాలొస్తున్నాయి.