హైదరాబాద్: టీమిండియా హిట్ ఓపెనింగ్ జోడీల్లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ జోడీ ఒకటి. ఈ ఇద్దరూ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. తాజాగా వీరిద్దరూ కలిసి సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. అయితే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ మైదానం బయట కావడం విశేషం.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) క్రికెట్ కమిటీలో తాజాగా ఈ ఇద్దరికీ చోటు కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఇప్పటికే ఈ క్రికెట్ కమిటీలో మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, రాహుల్ సంఘ్వితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్రికెట్లో కోచ్లు, సెలక్టర్ల ఎంపిక, ఇతర అంశాలను ఈ క్రికెట్ కమిటీ చూసుకుంటుంది. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే ఈ క్రికెట్ కమిటీ నియామకాలు జరిపినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు. అయితే, గంభీర్, సెహ్వాగ్ విషయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది.
గంభీర్ ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటి వ్యక్తి సెలక్టర్లను ఎలా నియమిస్తాడు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు గంభీర్ ఇప్పటికే డీడీసీఏలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు. ఈ క్రికెట్ కమిటీలో గంభీర్కు ఓ ముఖ్యమైన పదవి కట్టబెట్టనున్నారు.
ANNOUNCEMENT OF CRICKET COMMITTEE pic.twitter.com/0ovZyDtsVe
— DDCA (@delhi_cricket) July 25, 2018
మరోవైపు సెహ్వాగ్ క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. అంతేకాదు ఇండియా టీవీలో ఎక్స్పర్ట్గా విశ్లేషణలు అందిస్తుంటాడు. ఈ ఛానెల్ రజత్శర్మదే కావడం విశేషం. ఇక, సంఘ్వి ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్తో ఉండగా.. ఆకాశ్ చోప్రా కూడా కొన్ని చానెల్స్లో ఎక్స్పర్ట్గా ఉన్నాడు.
ఇది తమకు తెలిసిన విషయమే అయినా.. క్రికెట్ కమిటీ బోర్డులో మంచి పేరున్న ఆటగాళ్లను నియమించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డీడీసీఏ కార్యదర్శి వినోద్ తిహారా అన్నారు. ఇది గౌరవ కమిటీయా లేక వీళ్లకు జీతాలు ఇస్తారా? అన్న అంశంపై ఇంకా తేల్చుకోలేదని అన్నాడు.
గంభీర్ మాత్రం ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నాడని ఆయన అన్నారు. సెలక్టర్లు, కోచ్ను నియమించడంతో గంభీర్ పాత్ర ఉంటుందా? అన్న ప్రశ్నకు "అవును, గంభీర్ పాత్ర ఉంటుంది. నాకు మీ ప్రశ్న అర్ధం అయింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమేగా. లోధా కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపాడు.