మొత్తంగా 74 రన్స్:
తొలి వన్డే మ్యాచ్లో 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కడవరకు నిలిచి విజయాన్నందించాల్సిన మనీష్ పాండే.. 40 బంతుల్లో కేవలం 26 పరుగులే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో మంచి టచ్లో కనిపించిన ఈ కర్ణాటక బ్యాట్స్మన్ దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్లో 31 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఇక మూడో వన్డే రూపంలో మరో అవకాశం రాగా.. నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. చివరి మ్యాచులో 19 బంతుల్లో కేవలం 11 రన్స్ మాత్రమే చేశాడు. మొత్తంగా 74 రన్స్ చేశాడు. మనీశ్ వైఫల్యం జట్టుపై కూడా ప్రభావం చూపింది. వచ్చిన అవకాశాలను అతడు అందిపుచ్చుకోలేకపోయాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు.
పాండేకు జట్టులో చోటు కష్టమే
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్బజ్తో మాట్లాడుతూ... 'మనీష్ పాండే మరియు హార్దిక్ పాండ్యాలకు లంక పర్యటన రూపంలో మంచి అవకాశం వచ్చింది. అయినా సరిగా ఆడలేకపోయాడు. ఇద్దరూ 15-20 పరుగులు మాత్రమే చేశారు. వన్డే సిరీస్లో రాణించే అద్భుత అవకాశం ఎవరికైనా వచ్చిందా అంటే అది మనీశ్కే అని చెప్పాలి. మూడు మ్యాచ్ల్లోనూ పెద్ద స్కోర్లు చేసే వీలున్నప్పటికీ.. తనను తాను నిరూపించుకోలేకపోయాడు. సవాలుగా మారిన ఒక్క సందర్భం అతడు ఎదుర్కోలేదు. క్రీజులో నిలబడి పరుగులు చేయాల్సింది. అలా జరగలేదు. ఇకపై అతడికి జట్టులో చోటు కష్టమే' అని అన్నాడు.
హార్దిక్ పరిస్థితి అంతే:
'హార్దిక్ పాండ్యా కూడా నన్ను చాలా నిరాశపరిచాడు. ఇది నిజం. బహుశా అతడికి కూడా ఇకపై టీమిండియా వన్డేల్లో అవకాశం రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా.. చాలా కాలం పట్టొచ్చు. మూడు మ్యాచులో పరుగులు చేయనందున అతడు రేసులో వెనకబడిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ మరియు ఇషాన్ కిషన్ సరైన సమయంలో పరుగులు చేశారు. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. హార్దిక్ కంటే మిడిల్ ఆర్డర్లో ఈ ఇద్దరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇషాన్, సూర్యలు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు' అని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
అంచనాలకు మించి:
లంక టూర్కు యువ క్రికెటర్లతో బయల్దేరిన భారత్ అంచనాలకు మించి రాణించింది. వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలుపొందింది. మనీశ్ మినహా.. కుర్రాళ్లు కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, పృద్వి షా అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. పరుగుల వరద పారించిన సూర్యకుమార్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. దీపక్ చహర్ అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించాడు.