సర్రే జట్టుకు సైన్: కౌంటీ క్రికెట్ ఆడటం కోహ్లీకే లాభం

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కౌంటీ క్రికెట్ ఆడాలన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అభినందించాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే అక్కడి మైదానాల్లో ఆడటం వల్ల కోహ్లీకి బాగా కలిసొస్తుందని తెలిపాడు.
ఈ సందర్భంగా గ్యారీ కిర్స్టన్ మాట్లాడుతూ 'లండన్ దేశవాళీ ఫార్మాట్లో ఆడటం గొప్ప అవకాశం. కౌంటీ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటన కంటే ముందుగానే కోహ్లి ఆ ఫార్మట్లో ఆడితే అది బాగా కలిసొచ్చే అంశం. ఆ అనుభవం టీమిండియాకు బాగా పనికి వస్తుంది' అని చెప్పాడు.
2014లో ఇంగ్లాండ్లో పర్యటించిన జట్టులో విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. అయితే, ఆ పర్యటనలో కోహ్లీ పేలవ ప్రదర్శన చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో జరగబోయే కౌంటీ మ్యాచ్ల్లో భాగంగా సర్రే జట్టు తరపున కోహ్లీ బరిలోకి దిగనున్నాడు.

సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం
ఈ మేరకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కూడా చేసుకున్నాడు. కౌంటీ మ్యాచ్ల కారణంగా బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో టీమిండియా ఆడబోయే ఏకైక టెస్టు మ్యాచ్కు కోహ్లీ దూరం కానున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు గాను కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నాడు.

జూన్ నెల మొత్తం సర్రే జట్టు తరుపున
ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సర్రే జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ నెల మొత్తం సర్రే జట్టు తరుపున విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడనున్నాడు. జూన్ 1న కెంట్తో జరిగే వన్డే మ్యాచ్తో కోహ్లీ సర్రే జట్టుతో చేరతాడు. మూడు వన్డేల తర్వాత మరో మూడు నాలుగు రోజుల మ్యాచ్లు కూడా కోహ్లీ ఆడనున్నాడు. జూన్ 28తో విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ముగియనుంది.

కోహ్లీకి నామమాత్రపు మ్యాచ్ ఫీజు
కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్తో కాంట్రాక్ట్ అనగానే పెద్ద మొత్తంలో ఉంటుందని అంతా ఊహిస్తారు. అయితే సర్రే జట్టుతో చేసుకున్న ఒప్పందంలో అందుకు భిన్నంగా ఉంది. విరాట్ కోహ్లీకి రానుపోను విమాన టికెట్ ఖర్చులు, అక్కడ వసతి, నామమాత్రపు మ్యాచ్ ఫీజు మాత్రమే సర్రే జట్టు చెల్లిస్తోందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

నాణ్యమైన ప్రాక్టీస్ కోసమే
కేవలం ఇంగ్లాండ్ స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకే ముందుగా కోహ్లీ అక్కడికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. డబ్బుపై కాకుండా కేవలం నాణ్యమైన ప్రాక్టీస్ దొరికితే చాలని కోహ్లీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కౌంటీల్లో ఆడే సాధారణ ప్లేయర్కు ఇచ్చేంత మాత్రమే కోహ్లీకి కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 5టెస్టులు, 3వన్డేలు, 3టీ20లు
కోహ్లీ కౌంటీల్లో ఆడే నిర్ణయంపై కొందరు విమర్శలు గుప్పించినా అతడు మాత్రం ‘ఎప్పటి నుంచో ఆడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కొరిక తీరబోతుంది' అని చెప్పాడు. జూన్ చివరి వారం నుంచి మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. మే 8న జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications