ఒక క్రికెటర్గా ఈ అనుభవాన్ని నేను కోరుకోను: స్మిత్, వార్నర్పై కోహ్లీ

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతంలో ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్తో జనాలు వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వీరిద్దరూ బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురవ్వడం తనను ఎంతో బాధించిందని కోహ్లీ చెప్పాడు.
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో నాలుగు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్నైట్ స్కోరు 104/4తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌటైంది.
ఈ విజయం అనంతరం విరాట్ కోహ్లీ బాల్ టాంపరింగ్ ఉదంతంపై స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ ''అలా జరగడం చాలా బాధాకరం. ఆ విషయం చాలా పెద్దదైపోయింది. వార్నర్, స్మిత్ ఎలాంటి వారో నాకు తెలుసు. వారిని అలా చూడటం బాధించింది. అసలు క్రీడాకారులకు ఇలా జరగడమే ఎంతో వేదన కలిగిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
"దీనికి తోడు బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత విమానాశ్రయాల్లో వారితో అటు అభిమానులతో పాటు ఇటు జలనాలు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఒక క్రికెటర్గా అలాంటి అనుభవాన్ని చూడాలని నేను కోరుకోను" అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై ఆసీస్ క్రికెటర్లు బాల్ టాంపరింగ్కు పాల్పడ్డారు.
ఈ బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా పరువుని దిగజార్చింది. దీంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఏడాది పాటు, బాన్క్రాఫ్ట్ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్లకు దూరమయ్యారు.
భావోద్వేగానికి లోనైన స్టీవ్ స్మిత్
బాల్ టాంపరింగ్ ఉదంతం అనంతరం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నేను ఎవరినీ నిందించడం లేదు. నేను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ని. గత శనివారం ఏదైతే జరిగిందో అందుకు కెప్టెన్గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా. ప్రపంచంలో అత్యుత్తమ ఆటల్లో క్రికెట్ ఒకటి. క్రికెట్ నా జీవితం, మళ్లీ అడుగుపెడతా. నన్ను క్షమించండి, నేను పూర్తిగా నాశమయ్యా. నిర్ణయం పేరిట నేను ఘోర తప్పిదం చేశాను. పైగా దానిని కప్పి పుచ్చుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు నాకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఈ తప్పు నన్ను జీవితం వెంటాడుతుంది' అని అన్నాడు.
ఇది ఇతరులకు గుణపాఠం
'నాకు జరిగిన ఈ నష్టం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే.. ఇది ఇతరులకు గుణపాఠం కావటమే. ఇది క్రీడా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెట్ నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కొరుకుంటున్నా. ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లితండ్రులను చూడడం ఇబ్బందికరంగా ఉందని, మంచి వ్యక్తులు తప్పులు చేస్తుంటారని, కానీ తాను ఓ పెద్ద తప్పు చేసినట్లు స్మిత్ అంగీకరించాడు. దీని పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు స్మిత్ తెలిపాడు. తన నాయకత్వంలోని జట్టు వల్ల ఆస్ట్రేలియాకు జరిగిన నష్టం పట్ల క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.
సిడ్నీలో మాట్లాడుతూ
మరోవైపు డేవిడ్ వార్నర్ సైతం ఈ ఉదంతం అనంతరం సిడ్నీలో మాట్లాడుతూ 'క్రికెట్ను అమితంగా ప్రేమించే అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నా. క్రికెటర్గా నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు మద్దతుగా నిలిచిన మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేశాను. నన్ను క్షమించండి. మీరు తలదించుకునేలా ప్రవర్తించాను. నాకు కాస్త సమయం కావాలి. చేసిన తప్పుని సరిదిద్దుకునేందుకు, మీ నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు. తమ నిర్ణయం పట్ల ప్రజాగ్రహం ఇంతగా ఉంటుందని అనుకోలేదు' అంటూ ఉబికి వస్తున్న కన్నీటి పర్యంతమయ్యాడు.
వార్నర్ కన్నీటి పర్యంతం
'మేము దేశం తలదించుకునేలా ప్రవర్తించాం. మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అందులో నా పాత్ర కూడా ఉంది. మళ్లీ ఆస్ట్రేలియా ప్రజల మనసు చూరగొనేందుకు ఎంతో సమయం పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుతానికి నా కుటుంబానికి తోడుగా ఉంటా. ఈరోజు నేను ఇక్కడ ఎందుకు ఉన్నానంటే... కేప్ టౌన్లో ఏ తప్పు అయితే జరిగిందో దానిని అంగీకరించేదుకే. అది క్షమించారని తప్పు. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా. ఆస్ట్రేలియా పబ్లిక్ గౌరవాన్ని తిరిగి పొందేందుకు ఏం చేయడానికి నేను సిద్ధమే' అని వార్నర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications