కోహ్లీ భావోద్వేగ లేఖ:
విరాట్ కోహ్లీ తన 31వ బర్త్డే సందర్భంగా ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ సందేశాన్ని పోస్టు చేశాడు. తన గురించి తాను రాసుకున్న ఓ భావోద్వేగపూరిత లేఖను రిలీజ్ చేశాడు. ఇన్నాళ్ల తన జర్నీ, తన జీవితంలో ఎదురైన అనుభవాలను ఆ లేఖలో రాశాడు. కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నాడు. ఒకవేళ మొదటిసారి విఫలమైనా.. మళ్లీ మళ్లీ ప్రయత్నించు అని అంటున్నాడు.
జన్మదిన శుభాకాంక్షలు:
లేఖలో కోహ్లీ ఇలా పేర్కొన్నాడు. 'నా ప్రయాణం, జీవిత కష్టనష్టాలను 15 ఏళ్ల కోహ్లీకి వివరిస్తున్నా. ఈ లేఖను ఉత్తమంగా రాయడానికి ప్రయత్నించా. చీకూ మొదటగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీ భవిష్యత్ గురించి అనేక ప్రశ్నలున్నాయి. అయితే నన్ను క్షమించు, నేను వాటికి సమాధానం చెప్పలేను. ఎందుకంటే భవిష్యత్లో ఏం జరగనుందో తెలియదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం:
'ప్రతి సర్ప్రైజ్ తీయగా.. ప్రతి సవాలు అద్భుతంగా.. ప్రతి ఓటమి ఏదో ఒకటి నేర్పుతుంది. అయితే ఈ రోజు వీటిని నమ్మలేకపోవచ్చు. కానీ.. గమ్యం కన్నా ప్రయాణమే ముఖ్యం. నీ కోసం చాలా పెద్ద జీవితం ఉంది. నీ వద్దకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఏదేమైనా ముందుకు సాగడం మర్చిపోకు. మొదటిసారి విఫలమైనా.. మళ్లీ మళ్లీ ప్రయత్నించు' అని కోహ్లీ లేఖలో అన్నాడు.
కొందరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు:
'నిన్ను అభిమానించేవారు చాలా మంది ఉంటారు. అలాగే కొందరు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యం కలిగి ఉండు. ఈ రోజు మీ నాన్న ఇవ్వలేని షూస్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావని తెలుసు. అయితే, ఈ ఉదయం నీకిచ్చిన కౌగిలింత ముందు ఆ షూస్ పనికిరావు. కొన్ని సందర్భాల్లో ఆయన నీపట్ల కఠినంగా ఉండొచ్చు. అది కూడా నీ మంచి కోసమే' అని కోహ్లీ రాసుకొచ్చాడు.
కలలు జీవితాల్ని ఎలా మారుస్తాయో చూపించు:
తల్లిదండ్రులు మనల్ని కొన్నిసార్లు అర్థం చేసుకోలేరని అనిపిస్తుండొచ్చు. కానీ మన కుటుంబమే మనల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. నువ్వు కూడా వాళ్లని అలాగే ప్రేమించు. వీలైనంత సమయం వారితో ఉండు. మీ నాన్నని ప్రేమిస్తున్నావనే విషయం ఆయనకి చెప్పు. ఈ రోజే కాదు.. ప్రతీ రోజూ అలాగే చెబుతూ ఉండు. ఎప్పుడూ దయా గుణంతో ఉండు. కలలు మన జీవితాల్ని ఎలా మారుస్తాయో ప్రపంచానికి చూపించు' అని కోహ్లీ లేఖలో చెప్పుకొచ్చాడు.