

హైదరాబాద్: గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ (909) అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 27 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో 900పైచిలుకు పాయింట్లు అందుకున్న ఏకైక క్రికెటర్గా రికార్డు సాధించాడు. అంతేకాదు వన్డేల్లో, టెస్టుల్లో 900కు పైగా రేటింగ్ పాయింట్ల సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఈ జాబితాలో 1991లో చివరిసారిగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డీన్ జోన్స్ 918 పాయింట్లతో మెరిశాడు. ఆ తర్వాత.. ఎవరూ వన్డేల్లో ఆ స్థాయి ప్రదర్శనని చేయలేకపోయారు. అంతేకాదు క్రికెట్ చరిత్రలో ఒకేసారి వన్డేల్లో, టెస్టుల్లో 900కు పైగా పాయింట్లు సాధించిన రెండో క్రికెటర్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టాప్-3 స్ధానాల్లో నిలిచాడు. వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ అగ్రస్థానం ఉండగా, టెస్టు ర్యాంకింగ్స్లో రెండో స్థానం... టీ20ల్లో మూడో స్థానంలో నిలిచాడు.
టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 947 పాయింట్లతో ఉండగా, కోహ్లీ 912 పాయింట్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20ల్లో 786 పాయింట్లతో బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆరోన్ ఫించ్ (784), విరాట్ కోహ్లీ (776) పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
1991లో ఆస్ట్రేలియా డీన్ జోన్స్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకముందు వివ్ రిచర్డ్స్ (1985లో 935 రేటింగ్ పాయింట్లు), జహీర్ అబ్బాస్ (1983లో 931), గ్రెగ్ చాఫెల్ (1981లో 921), డేవిడ్ గోవర్ (1983లో 919), జావెద్ మియాందాద్ (1987లో 910) ఈ జాబితాలో ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో 558 పరుగులతో విశేషంగా రాణించడంతో తన రేటింగ్ పాయింట్లను కోహ్లీ మరింత పెంచుకున్నాడు. అంతకుముందు టెస్టుల్లో 912 రేటింగ్ పాయింట్లను కోహ్లీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒకే సమయంలో ఏబీ డివిలియర్స్ తర్వాత టెస్టు, వన్డే ఫార్మాట్లలో 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన క్రికెటర్గా కోహ్లి నిలిచాడు.
దీంతో 900కుపైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత క్రికెటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఒక్కడే 887 వన్డే రేటింగ్ పాయింట్లను సాధించాడు. అయితే రెండు ఫార్మాట్లలో 900పైగా రేటింగ్ పాయింట్లను సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో కోహ్లీ ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక, వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి అగ్రస్థానంలో నిలిచాడు. బుమ్రా రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఆఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ 787 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.